న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడి వల్లనే వన్డే ప్రపంచకప్ రాలేదని, సమష్టి ప్రదర్శనతోనే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి స్పష్టం చేశాడు. జట్టులో వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ఏ మాత్రం మంచిది కాదన్నాడు.
దురదృష్టవశాత్తు భారత్లో జట్టు కంటే వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపాడు. వ్యక్తిగత పూజ ఎక్కువవడంతోనే టీమిండియా గత పదేళ్లుగా ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేకపోయిందని చెప్పుకొచ్చాడు.

వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో ఓ జాతీయ చానెల్తో మాట్లాడిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్లో భారత జట్టులో ప్రతీ ఒక్కరు రాణించారని, కానీ అందరూ ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్ గురించే మాట్లాడుతారని అసహనం వ్యక్తం చేశాడు.
'2011 వన్డే ప్రపంచకప్లో యువరాజ్ సింగ్కు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వలేదు. జహీర్ ఖాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్ పరిస్థితి కూడా అదే. ఆ టోర్నీలో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు చేశాడు. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరు. ధోనీ కొట్టిన ఒక సిక్సర్ గురించే మీడియా తరుచూ మాట్లాడుతూ ఉంటోంది. మీడియా, జనాలు వ్యక్తులకు ప్రాధాన్యమిచ్చి, జట్టును మరిచిపోయారు.
శ్రీలంకతో వాంఖడే వేదికగా జరిగిన ఫైనల్లో ధోనీ కొట్టిన సిక్స్తో టీమిండియా విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె (88 బంతుల్లో 13 ఫోర్లతో 103 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ప్రారంభంలోనే కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో గౌతమ్ గంభీర్ ( 122 బంతుల్లో 9 ఫోర్లు 97), నాటి యువ ప్లేయర్ విరాట్ కోహ్లీ (35)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు.

కోహ్లీ ఔటైనా.. ధోనీతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. నాలుగో వికెట్కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే సెంచరీ చేరువైన క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన గంభీర్ క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. ఇలా తాను ఔటవ్వడానికి కూడా ధోనీనే కారణమని గంభీర్ తెలిపాడు. తన స్కోర్ చెప్పడంతోనే తీవ్ర ఒత్తిడికి లోనై ఔట్ కావాల్సి వచ్చిందన్నాడు.
ఇక గంభీర్ ఔటైనా.. యువరాజ్తో కలిసి ధోనీ ( 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 నాటౌట్) 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్ను ముగించాడు. అయితే ధోనీ సూపర్ ఇన్నింగ్స్, కెప్టెన్సీతో గంభీర్కు అంతగా పేరు రాలేదు. నిజానికి ఒత్తిడిని జయించి భారత్ను ఒడ్డుకు చేర్చింది మాత్రం గంభీరే అయినప్పటికీ.. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడకుంటే విజయం దక్కేది కాదు.