
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్లో టీమిండియా దారుణ ప్రదర్శనతో సెమీస్ అవకాశాలను చేజార్చుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన కోహ్లీసేన.. తదుపరి మూడు మ్యాచ్లు గెలిచిన టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితిని తెచ్చుకుంది. దాంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్తో కీలక పోరులో టీమ్మేనేజ్మెంట్ చేసిన ప్రయోగం బెడిసి కొట్టడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మను కాదని ఇషాన్ కిషన్ను ఆడించడం బెడిసికొట్టింది. దాంతో ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీని నిందిస్తూ విమర్శలు గుప్పించారు. అయితే ఈ నిర్ణయం టీమ్మేనేజ్మెంట్ సమష్టిగా తీసుకున్నదని, మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీ సూచనతోనే ఈ ప్రయోగం చేశామని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు. ఈ ప్రయోగానికి రోహిత్ శర్మ కూడా ఆమోదం తెలిపాడన్నాడు.
మిడిలార్డర్లో ఎక్కువ లెఫ్టాండర్స్ ఉండటంతోనే ఇషాన్ను ఓపెనర్గా ప్రమోట్ చేయాలని ధోనీ సూచించాడన్నాడు. అంతేకాకుండా భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకొచ్చారు. అయితే ఈ మార్పులు కెప్టెన్ విరాట్ కోహ్లీనే చేశాడని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు.
ఓ స్ట్రాటజిస్ట్గా విరాట్ కోహ్లీ ఎప్పుడూ విఫలమయ్యాడని, ఒక మ్యాచ్ ఫలితంతో మహేంద్ర సింగ్ ధోనీ ఇలా తుది జట్టులో మార్పులు చేయడన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మార్పుల్లో ధోనీ పాత్ర లేదన్నాడు. 'స్ట్రాటజిస్ట్గా విరాట్ కోహ్లీ ఎప్పుడూ ఆకట్టుకోలేదు. ఆదివారం కూడా అలానే నిరాశపరిచాడు. పాకిస్థాన్ ఒక్క మ్యాచ్ ఓడిపోగానే జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది.
ఆటగాళ్లను మార్చడమే కాకుండా బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చాడు. రోహిత్ స్థానంలో ఇషాన్ను ఓపెనర్గా పంపించాడు. నేను ధోనీతో కలిసి చాలా ఏళ్లు ఆడాను. అతను ఒక్క మ్యాచ్లో విఫలమైన తర్వాత ఇలాంటి బేఖారు నిర్ణయాలు తీసుకోడనేది నా గట్టి నమ్మకం. కోహ్లీ నిర్ణయాలను ఇతర సపోర్ట్ స్టాఫ్ కూడా వ్యతిరేకించలేదని నాకు అర్థమవుతోంది.'అని గంభీర్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్లో పేర్కొన్నాడు.