కేఎల్ రాహుల్ను మూడు వన్డేల్లో ఆడించాలి: గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ: నిలకడలేమి ఫామ్తో సతమతమవుతున్న టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్కు మరిన్ని అవకాశాలివ్వాలని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సూచించాడు. ఫామ్లో లేని ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో రాహుల్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. నాలుగు మ్యాచ్ల్లో 1, 0, 0, 14 రన్స్తో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే టీమ్ఇండియా చివరి టీ20లో అతనికి అవకాశమివ్వలేదు.

అవకాశాలివ్వాలి..
అయితే, వన్డే సిరీస్లో రాహుల్ను ఆడించాలని గంభీర్ సూచించాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. మూడు వన్డేల్లోనూ అవకాశమివ్వాలన్నాడు. 'ఫామ్లో లేని ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడంలో ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాహుల్ ఇప్పుడు మూడు వన్డేల్లోనూ ఆడాలి. ఎవరైనా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుంటే వారికి మరిన్ని అవకాశాలిచ్చి అండగా నిలవాలి. వారు మళ్లీ గాడిలో పడాలంటే అదొక్కటే మార్గం. ఎందుకంటే తుది జట్టు నుంచి తప్పిస్తే వారికది ఇబ్బందికరంగా ఉంటుంది' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్లో మెరిసి..
ఇదిలా ఉండగా, రాహుల్ గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్లో అత్యధికంగా 670 పరుగులు చేశాడు. ఆపై ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడడంతో కొద్ది రోజులు జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు టీ20 సిరీస్లో అందుబాటులోకి వచ్చినా ఫామ్ కోల్పోయి సతమతమౌతున్నాడు. రాహుల్ గైర్హాజరీలో ఓపెనర్గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇకపై కూడా తాను టీ20ల్లో ఓపెనర్గా ఆడతానని స్పష్టం చేయడంతో.. టీ20 జట్టులో రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది.

రాహుల్కు ఛాన్స్..
ఇక మూడు వన్డేల సిరీస్లో భాగంగా మంగళవారం ప్రారంభమైన తొలి వన్డేలో అందరూ ఊహించనట్లుగా కేఎల్ రాహుల్కు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి భారత్ బ్యాటింగ్కు దిగగా.. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే జోరు మీదున్న రిషభ్పంత్ను పక్కనపెట్టగా.. కృనాల్ పాండ్యా, ప్రసిధ్ కృష్ట ఈ మ్యాచ్తో వన్డేల్లోకి అరంగేట్రం చేశారు. కుల్దీప్ యాదవ్ కూడా జట్టులోకి రాగా.. సూర్య, నటరాజన్లకు చోటు దక్కలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications