Gautam Gambhir: విదేశీ కోచ్ల కంటే స్వదేశీ కోచ్లే ఎంతో నయమని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. భారత్ కోచ్లకు ఇంగ్లీష్ అంత రాకున్నా.. ల్యాప్టాప్ వాడటం తెలియకున్నా.. జట్టుకు కావాల్సింది చేస్తారని అభిప్రాయపడ్డాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్, పాకిస్థాన్ జట్ల ప్రదర్శన చూస్తేనే ఈ విషయం అర్థమవుతుందని చెప్పాడు.
స్వదేశీ కోచ్ల గైడెన్స్లో టీమిండియా ఫైనల్ చేరిందని, విదేశీ కోచ్లతో బరిలోకి దిగిన పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిదారిపట్టిందని గుర్తు చేశాడు. 'వన్డే ప్రపంచకప్లో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనను మనమంతా చూశాం. ఈ ప్రదర్శన విదేశీ కోచ్లు అవసరం లేదనే విషయాన్ని స్పష్టం చేసింది. విదేశీ కోచ్ల కంటే మన కోచ్లు అత్యుత్తమమనే విషయాన్ని తెలియజేసింది.

మన కోచ్లకు ఉన్న సమస్య ఏంటంటే.. ల్యాప్టాప్ల సాయంతో ప్రజెంటేషన్ ఇవ్వలేరు. ఇంగ్లీష్ బాగా మాట్లాడలేరు. కార్పోరేట్ కల్చర్ పాటించలేరు. కానీ జట్టు విజయానికి కావాల్సిన వ్యూహాలతో పాటు గ్రౌండ్ వర్క్ చేయగలరు. భారత్, పాకిస్థాన్ దేశాలు గత 10 ఏళ్ల నుంచే క్రికెట్ ఆడటం మొదలు పెట్టలేదు.
ఇరు దేశాల్లో ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లు ఉన్నారు. భారత్.. భారత మాజీ క్రికెటర్లను, పాకిస్థాన్ జట్టు పాకిస్థాన్ ఆటగాళ్లనే కోచ్లుగా నియమించాలి. ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లు కోచింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తే వారికే అవకాశం ఇవ్వాలి. ఇరు దేశాలు కూడా స్వదేశీ కోచ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీడల్లో భావోద్వేగమనేది చాలా ముఖ్యం. జాతీయ జెర్సీ ధరించినప్పుడు కలిగే భావన ప్రత్యేకం.
రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ పొడిగించకుంటే.. ఇతర భారత కోచ్లు అతని స్థానాన్ని భర్తీ చేస్తారు.'అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా పనిచేసిన గౌతమ్ గంభీర్.. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో కోల్కతా నైట్రైడర్స్కు మారాడు. మెంటార్గా గంభీర్.. ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లను గుర్తించాడు. నవ్దీస్ సైనీ, ఆయుష్ బదోనీ వంటి ఆటగాళ్లు గంభీర్ గైడెన్సీలోనే ప్రపంచానికి పరిచయమయ్యారు.