

న్యూఢిల్లీ: ఫస్ట్ టెస్ట్లో చిత్తుగా ఓడిన టీమిండియా.. అదే మ్యాచ్లో తొలి రెండు రోజులు ఆధిపత్యం చెలాయించామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సూచించాడు. అడిలైడ్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో భారత్ 36/9 పరుగులకే పరిమితమై పరువు తీసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకొని సిరీస్లో 1-0 లీడ్లో నిలిచింది. ఈ నేపథ్యంలోనే గంభీర్ రెండో టెస్టుకు ముందు భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ బాక్సింగ్ డే టెస్ట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'తొలి టెస్టులో రెండు రోజుల పాటు పూర్తి ఆధిపత్యం భారత్దేనని ఆటగాళ్లు గుర్తించాలి. ఆ మ్యాచ్లో మొత్తం పైచేయి సాధించింది. కానీ, ఒక్క సెషన్లో తడబడి మ్యాచ్ను చేజార్చుకుంది. ఈ సిరీస్లో ఇంకా మూడు టెస్టులు ఉన్నాయనే విషయాన్ని భారత ఆటగాళ్లు గ్రహించాలి. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ మహ్మద్ షమీ లేకపోవడం బాధాకరం. ఇలాంటి పరిస్థితుల్లో అజింక్య రహానె ఎలాంటి పాత్ర పోషిస్తాడనేదే కీలకంగా మారనుంది. అతడిపై పెద్ద బాధ్యతలు ఉన్నాయి. టీమిండియా రెండో టెస్టు జట్టు కాంబినేషన్ తయారీ ఇప్పుడు ఆసక్తిగా మారింది' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఫస్ట్ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులు చేసింది. కెప్టెన్ కోహ్లీ(74) టాప్ స్కోరర్. అనంతరం బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా 191 పరుగులకే ఆలౌటైంది. దీంతో కోహ్లీసేనకు తొలి ఇన్నింగ్స్లో 53 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక రెండో రోజు చివర్లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలోనే మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన గంటన్నరకే ఆలౌటైంది. 36 పరుగులకు 9 వికెట్లు కోల్పోగా షమీ(1) గాయం కారణంగా తప్పుకొన్నాడు. చివరికి ఆస్ట్రేలియా 90 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయం సాధించింది. ఇక బాక్సింగ్ డే టెస్ట్ శవివారం నుంచి మొదలవ్వనుంది.