
న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్తో తొలి మ్యాచులోనే తలపడటం భారత జట్టుకు కలిసొచ్చే అంశమని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. ప్రతిష్టాత్మకమైన ఈ మెగా పోరులో ముందుగానే ఈ హై ఓల్డేజ్ మ్యాచ్ జరిగితే కోహ్లీసేనపై ఒత్తిడి తగ్గుతుందని, మిగతా టోర్నీపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. దాంతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారత్ X పాక్ మ్యాచ్కు ముహుర్తం ఖారారైంది. దీని ప్రకారం అక్టోబర్ 24న పాక్తో జరిగే పోరుతో టీమిండియా తన వరల్డ్కప్ వేటను మొదలుపెట్టనుంది. దాంతో 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత్-పాక్ మళ్లీ తలపడనున్నాయి. ఈ క్రమంలోనే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్పై గంభీర్ స్పందించాడు. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ.. టోర్నీ ఆరంభంలోనే భారత్-పాక్ తలపడటం సంతోషంగా ఉందన్నాడు.
'మేం గెలిచిన 2007లోనూ అంతే! ఆ టీ20 ప్రపంచకప్లో మా తొలి మ్యాచ్ స్కాట్లాండ్తో జరగాలి. వర్షంతో అది కుదర్లేదు. ప్రాక్టికల్గా తొలి మ్యాచ్ ఆడింది మాత్రం పాకిస్థాన్తోనే. నేను ఇప్పుడు చెబుతోందీ అదే. ఆరంభంలోనే పాక్తో తలపడితే టీమిండియాకు మేలు. అదే పనిగా పాక్ మ్యాచ్ గురించి ఆలోచించకుండా మిగతా టోర్నీపై దృష్టి పెట్టొచ్చు. దేశ ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంటుందనుకోండి. ఫలితం గురించి మనకు తెలియదు. కానీ, టోర్నీ ఆరంభంలోనే రెండు జట్లు ఆడుతున్నందుకు నేనైతే సంతోషంగా ఉన్నాను' అని గంభీర్ స్పష్టం చేశాడు.
మరోవైపు టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఐసీసీ టోర్నీల్లో పదేపదే సెమీస్ లేదా ఫైనల్స్లో ఓడిపోతుండటంతో ఈ సారి దాన్నుంచి బయటపడాలని భావిస్తోంది. కీలక మ్యాచుల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
పాక్తో పోరుతో మెగా టోర్నీని ఆరంభించనున్న భారత్.. తన తర్వాతి మ్యాచ్లో అక్టోబరు 31న అబుదాబి వేదికగా న్యూజిలాండ్ను ఢీకొంటుంది. అనంతరం నవంబరు 3న అఫ్గానిస్థాన్తో ఆడుతుంది. భారత్ తన మిగతా రెండు సూపర్-12 మ్యాచ్లను క్వాలిఫయింగ్ గ్రూప్-బి విజేత (నవంబరు 5)తో, గ్రూప్-ఎ రన్నరప్ (నవంబరు 8)తో ఆడుతుంది.
టోర్నమెంట్ తొలి రౌండ్ అక్టోబరు 17న ఒమన్లో ఆరంభమవుతుంది. గ్రూప్-ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా.. గ్రూప్-బిలో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ ఉన్నాయి. గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 12కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో అసలు దశ అయిన సూపర్ 12 అక్టోబరు 23న మొదలవుతుంది. ఆ రోజు ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా, రెండు సార్లు ఛాంపియన్ వెస్టిండీస్తో ఇంగ్లాండ్ తలపడతాయి. తొలి సెమీఫైనల్ నవంబరు 10న అబుదాబిలో, రెండో సెమీఫైనల్ నవంబరు 11న దుబాయ్లో ఆడతారు. నవంబరు 14న జరిగే ఫైనల్కు దుబాయ్ ఆతిథ్యమిస్తుంది. నవంబర్ 15 రిజర్వ్ డే.