Gautam Gambhir: ఫైనల్లో ఆడింది న్యూజిలాండ్ జట్టేనా?

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడింది న్యూజిలాండ్ జట్టేనా? అంటూ ఆ టీమ్ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశాడు. తానే న్యూజిలాండ్ అభిమానినైతే.. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసేవాడినని చెప్పుకొచ్చాడు. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆ జట్టు ముందు ఉంచినా.. బౌలర్లు కాపాడుకోలేకపోయారు. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ సూపర్ బ్యాటింగ్ ముందు తెలిపోయాడు. అయితే తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన కాలమ్లో గంభీర్.. న్యూజిలాండ్ ఆటతీరును తప్పుబట్టాడు.

న్యూజిలాండ్ టీమేనా?
'టీ20 ప్రపంచకప్లో భారత్ తర్వాత న్యూజిలాండే నా ఫేవరేట్ టీమ్. కానీ ఫైనల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. బ్యాటింగ్లో అద్భుతంగా రాణించి 172/4 పరుగులు చేసిన ఆ జట్టు.. బౌలింగ్లో మాత్రం విఫలమైంది. భీకరమైన బౌలింగ్ లైనప్, సూపర్ ఫీల్డింగ్ కలిగిన న్యూజిలాండ్కు ఈ స్కోర్ డిఫెండ్ చేయడం కష్టమేమి కాదు. కానీ ఆ జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వలేకపోయింది. సూపర్-12లో భారత్ను, సెమీస్లో ఇంగ్లండ్ను ఓడించిన జట్టులా కనిపించలేదు. అసలు ఆడుతుంది న్యూజిలాండ్ జట్టేనా? అనే సందేహం కలిగింది.

ప్లాన్ లేకుండా..
కచ్చితమైన ప్రణాళికలు.. పకడ్బందీ వ్యూహాలతో బరిలోకి దిగే న్యూజిలాండ్ ఫైనల్లో మాత్రం అవి లేకుండానే బరిలోకి దిగినట్లుగా కనిపించింది. నేనే న్యూజిలాండ్ అభిమానినైతే.. నష్టపరిహారం కోరేవాడిని. ఏ మాత్రం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఇక మిచెల్ మార్ష్ను ఔట్ చేసేందుకు ఎలాంటి గేమ్ ప్లాన్ కూడా న్యూజిలాండ్ రచించలేదు. అతనికి పదే పదే షార్ట్ పిచ్ బంతులను వేస్తూ మూల్యం చెల్లించుకుంది. అంతేకాకుండా లైన్ లెంగ్త్ కూడా మిస్సయ్యింది. మార్ష్ ఓ వెస్టర్న్ ఆస్ట్రేలియాన్, అతను పెర్త్ వేదికగా ఎక్కువగా మ్యాచ్లు ఆడాడు. బహుషా అతను నేర్చుకుంది కూడా ఫుల్ షాట్ ఆడటమే అనుకుంటా. ఈ విషయం కూడా తెలుసుకోకుండా.. అతనికి షార్ట్ పిచ్ బంతులు వేయడం విస్మయానికి గురిచేసింది.'అని గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కేన్ మామ చెలరేగినా..
మెగా ఫైనల్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 85) అద్భుతంగా ఆడగా... హాజల్వుడ్ (3/16) బౌలింగ్లో రాణించాడు. అనంతరం ఆసీస్ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి గెలిచింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 77 నాటౌట్), డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో4 ఫోర్లు, 3 సిక్స్లతో 53) రెండో వికెట్కు 59 బంతుల్లోనే 92 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మొత్తం 289 పరుగులు చేసిన వార్నర్ 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'గా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications