
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు అందుబాటులో ఉండకుండా డబ్బుల కోసం ఐపీఎల్లో పని చేస్తున్నాడంటూ తనపై వచ్చిన విమర్శలకు టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఘాటుగా సమాధానమిచ్చాడు. తాను ఢిల్లీలో 5 వేల మందికి భోజనాలు పెడుతున్నానని, వారి కోసం నెలకు రూ.25 లక్షలు తన జేబులో నుంచే ఖర్చు అవుతుందని తెలిపాడు. తమ ఇంట్లో డబ్బులు కాచే చెట్టు లేదని, అందుకే ఐపీఎల్లో పని చేస్తున్నానని స్పష్టం చేశాడు. ఇలా చేస్తున్నందుకు తాను ఏ మాత్రం సిగ్గు పడటం లేదన్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్లో గౌతమ్ గంభీర్.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి మెంటార్గా వ్యవహరించాడు. అతని పర్యవేక్షణలోని లక్నో.. ప్లే ఆఫ్స్ చేరింది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీతో ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఇక క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ గంభీర్..తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక ఎంపీగా ఉంటూనే ఐపీఎల్లో మెంటార్గా లక్నోకు సేవలందించాడు. అయితే కొందరు గంభీర్ను తప్పుబట్టారు. బాధ్యత గల పదవిలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండకుండా డబ్బుల కోసం ఐపీఎల్లో పని చేస్తున్నాడని విమర్శించారు. వీటిపై గంభీర్ తాజాగా తనదైన శైలిలో బదులిచ్చాడు.
'నేను ఐపీఎల్లో పని చేయడానికి ఓ కారణం ఉంది. ఢిల్లీలో నేను 5 వేల మందికి భోజనాలు పెడుతున్నా. దీని కోసం నెలకి రూ.25 లక్షలు ఖర్చు అవుతోంది. అంటే ఏడాదికి రూ.2.75 కోట్లు. ఇవన్నీ నా జేబులోంచి పెడుతున్నా. మరో రూ.25 లక్షలు పెట్టి లైబ్రరీ కట్టించాను. ఎంపీ ల్యాడ్ ఫండ్ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదు. ఎంపీ ల్యాడ్ ఫండ్ ద్వారా వచ్చే డబ్బులతో మా కిచెన్లో వంట సామాను కూడా కొనలేం. వీటన్నింటికీ ఖర్చు పెట్టడానికి మా ఇంట్లో డబ్బులు కాచే చెట్టు లేదు. అందుకే ఐపీఎల్లో పనిచేస్తూ సంపాదిస్తున్నా.
ఆ డబ్బులతో 5 వేల మందికి అన్నం పెడుతున్నా. ఐపీఎల్లో పని చేయడానికి కానీ, కామెంటరీ చెబుతున్నానని చెప్పుకోవడానికి నేను ఏ మాత్రం సిగ్గు పడటం లేదు. ఎందుకంటే నా అంతిమ లక్ష్యం ఆకలితో ఉన్నవారి కడుపు నింపడమే.' అని గౌతమ్ గంభీర్ కామెంట్ చేశాడు.