టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ యువ బ్యాటర్ అసాధారణ శతకంతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఈ తరహా సెంచరీని తాను ఇప్పటి వరకు చూడలేదన్నాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ముంబై వేదికగా ఆదివారం జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా 150 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది. ఈ విజయంతో 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
ఈ తరహా సెంచరీ చూడలేదు..
'ఇంగ్లండ్ నాణ్యమైన జట్టు. ఓటమి భయం లేకుండా ఆడాలనుకుంటున్నాం. 250-260 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేయాలనుకుంటున్నాం. ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు మేం 120 పరుగులకే ఆలౌట్ కావచ్చు. కానీ మేము సరైన ట్రాక్లో ఉన్నాం. ఇదే జోరును కొనసాగించాలనుకుంటున్నాం. ఫియర్లెస్ క్రికెట్తో ముందుకు సాగాలనుకుంటున్నాం. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లకు మేం అండగా నిలవాలనుకుంటున్నాం.

ఈ తరహా ఆటగాళ్ల పట్ల మేం ఓపికతో ఉండాలనుకుంటున్నాం. వారికి అండగా ఉండటం చాలా ముఖ్యం. ఈ తరహా ఆటగాళ్లలో చాలా మంది ఫియర్లెస్ క్రికెట్ ఆడేందుకు ఐడియాలజీని నమ్ముతారు. ఈ మ్యాచ్లో నిలకడగా గంటకు 140-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లపై అభిషేక్ శర్మ శతకం సాధించాడు. ఈ తరహా సెంచరీని నేను ఇప్పటి వరకు చూడలేదు. మా కుర్రాళ్లు ఇప్పటికే చాలా క్రికెట్ ఆడారు. ఈ తరహా బౌలర్లను ఎదుర్కొన్నారు. ఇదంతా భారత క్రికెట్లోని భాగం.
కంకషన్ వివాదంపై మాట్లాడుతూ..
ఫలితాలు అనుకూలంగా ఉన్నప్పుడు పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉంటాయి. 140-150 కోట్ల భారతీయులకు ప్రాతినిథ్యం వహించడం అంటే ఏమిటో మా ఆటగాళ్లకు బాగా తెలుసు. రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తీ కలిసి బౌలింగ్ చేయడం నాకు చాలా ముఖ్యం. వీలైనంత వరకు బ్యాట్తో కష్టపడాలనుకుంటున్నాం. కంకషన్ గాయానికి గురైన శివమ్ దూబే ఈ రోజు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు.
అతనికి హర్షిత్ రాణా సరైన సబ్స్టిట్యూషనే(నవ్వుతూ). టీ20 క్రికెట్లో ఓపెనర్లు తప్పా ఫిక్స్డ్ బ్యాటింగ్ ఆర్డర్ లేదు. వన్డేల్లోనూ మేం వీలైనంత దూకుడుగా ఆడాలనుకుంటున్నాం. మా ఫియర్లెస్ గేమ్తో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నాం.'అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.
అభిషేక్ శర్మ ఊచకోత..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. అభిషేక్ శర్మ(54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్లతో 135) విధ్వంసకర శతకంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మతో పాటు శివమ్ దూబే(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 30) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్(3/38) మూడు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్(2/32) రెండు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఇంగ్లండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫిల్ సాల్ట్(23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 55) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/25) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, శివమ్ దూబే, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్కి ఓ వికెట్ దక్కింది.