వన్డే ప్రపంచకప్ 1992లో భారత్ లీగ్ స్టేజ్లోనే ఇంటి ముఖం పట్టడంతో తాను తీవ్రంగా ఏడ్చానని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైందని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో తన వయసు 11 ఏళ్లు మాత్రమేనని, ఆ ఓటమిని తట్టుకోలేక రాత్రంత ఏడ్చానని తెలిపాడు.
ఆ క్షణమే టీమిండియాకు ప్రపంచకప్ అందించాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంభీర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 'ఒక మ్యాచ్లో భారత్ పరాజయం చూసిన తర్వాత ప్రపంచకప్ గెలవాలనే బలమైన కోరిక నాకు కలిగింది. బ్రిస్బేన్ వేదికగా 1992 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది.

ఆ రోజు రాత్రంతా ఏడ్చాను. అంతకుముందు కానీ.. ఆ తర్వాత కానీ అంతగా ఏడ్చిన సందర్భాలు లేవు. ఆ రోజు మాత్రం అలా ఎందుకు ఏడ్చానో కూడా నాకు తెలియదు. అప్పుడు నా వయసు 11 ఏళ్లు మాత్రమే. ఆ క్షణమే భారత్ కోసం ప్రపంచకప్ గెలవాలని బలంగా నిశ్చయించుకున్నా. ఆ నా కల 2011లో తీరింది. 32 ఏళ్ల కిందట జరిగిన ఆ మ్యాచ్లో చివరి ఓవర్లో వెంకటపడి రాజు రనౌటయ్యాడు.
ఆ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం వేకువజామునే జరిగింది. నేను పొద్దున ఐదు గంటలకు నిద్రలేచి ఆ మ్యాచ్ చూశాను.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్లకు 237 పరుగులు చేసింది. వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని డక్వర్త్ లూయిస్ పద్దతిన 47 ఓవర్లలో 235 పరుగులకు కుదించారు. భారత్ సరిగ్గా 234 పరుగులు చేసి ఓటమిపాలైంది.
గంభీర్ తన కెరీర్లో రెండు ప్రపంచకప్లు సాధించాడు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ల్లో గంభీర్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ రెండు టోర్నీల ఫైనల్లో గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్లో తీవ్ర ఒత్తిడిలో 97 పరుగులతో రాణించి భారత జట్టు విజయానికి బాటలు వేసాడు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
ఈ రెండు ప్రపంచకప్ల తర్వాత టీమిండియా.. రోహిత్ శర్మ సారథ్యంలో తాజాగా మరో టైటిల్ను ముద్దాడింది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియడంతో తదుపరి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనకు ముందు కొత్త కోచ్ పేరును ప్రకటిస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా ఇప్పటికే వెల్లడించాడు.