న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే కోసం ఏమైనా చేస్తానని మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ తెలిపాడు. ఇప్పటికే తన ఆల్టైమ్ అత్యుత్తమ కెప్టెన్ కుంబ్లేనే అని తెలిపిన ఈ పొలిటీషన్ కమ్ మాజీ క్రికెటర్.. అతని కోసం తన జీవితాన్నైనా త్యాగం చేస్తానన్నాడు. కుంబ్లే భారత జట్టుకు కెప్టెన్గా ఉన్న సమయంలో తనకు ఎంతో మద్దతుగా నిలిచాడని, అతనిచ్చిన సపోర్ట్ మరే కెప్టెన్ తనకు ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు.
2007-08 మధ్యకాలంలో కుంబ్లే టీమిండియా టెస్ట్ జట్టుకు సారథ్యం వహించాడు. అతని కెప్టెన్సీలో భారత్ మూడు గెలిచి.. నాలుగింటిలో ఓటమిపాలైంది. ఇక క్రికెట్ వీడ్కోలు పలికినంతరం.. భారత జట్టుకు కోచ్గా వ్యవహరించారు. తర్వాత ఆయనే ఆ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా స్పోర్ట్స్ తక్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్.. కుంబ్లేపై ప్రశంసల జల్లు కురిపించాడు.
2008లో ఆస్ట్రేలియా పర్యటన సమయంలో జరిగిన ఓ ఘటనను గుర్తు చేసుకొని ఈ దిగ్గజ స్పిన్నర్ కెప్టెన్సీని కొనియాడాడు. ''సెహ్వాగ్ నేను కలిసి డిన్నర్ చేస్తున్న సమయంలో కుంబ్లే మా దగ్గరకు వచ్చి.. సిరీస్ మొత్తం మీ ఇద్దరే ఓపెనింగ్ చేయాలని చెప్పారు. ఎనిమిదిసార్లు డకౌట్ అయినా పర్వాలేదు. ఓపెనింగ్ జోడీ మాత్రం మీరే అన్నాడు. అలాంటి మాటలు నా కెరీర్లో ఎవరి నుంచి కూడా వినలేదు. కాబట్టి, నేను నా జీవితాన్ని ఎవరికోసమైన త్యాగం చేయాల్సి వస్తే.. అది అనిల్ కుంబ్లే కోసమే చేస్తా. ఆరోజు అతను అన్న మాటలు ఇంకా నా మదిలో అలానే ఉన్నాయి' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఇక ఆ సిరీస్లో ఢిల్లీ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో గంభీర్ కెరీర్ బెస్ట్ స్కోర్ 206 పరుగులు నమోదు చేశాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక కుంబ్లే చివరి టెస్ట్ ఇదే మ్యాచ్ కావడం గమనార్హం. ఇక అంతకుముందు ఓ షోలో గంభీర్ను భారత్ ఆల్టైమ్ టెస్ట్ ఎలెవన్ చెప్పమనగా.. కుంబ్లేను కెప్టెన్గా ఎంపిక చేశాడు. అంతేకాకుండా అతనే తన అత్యుత్తమ ఆల్టైమ్ కెప్టెన్ అని కూడా పేర్కొన్నాడు. కుంబ్లే కనుక ఎక్కువకాలం కెప్టెన్గా కొనసాగుంటే ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకునేవాడన్నాడు.
రాయుడు, ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్పై కనికరం చూపలేకపోయాం: ఎమ్మెస్కే ప్రసాద్