
ఎవరి జన్మహక్కు కాదు..
'కెప్టెన్సీ అనేది ఎవరికీ జన్మహక్కు కాదు. మహేంద్ర సింగ్ ధోనీ లాంటి దిగ్గజ ఆటగాడి నుంచి విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. మూడు ఐసీసీ ట్రోఫీలు, నాలుగు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్న ధోనీ ఎలాంటి భేషజాలు లేకుండా.. కోహ్లీ సారథ్యంలో ఆడాడు. కోహ్లీ నిర్ణయంతో టాస్ వేయడం, మైదానంలో ఫీల్డర్లను మోహరించే విషయంలో మాత్రమే మార్పు వస్తుంది. అంతకు మించిన పెద్ద మార్పులేం జట్టులో కనిపించవు. అతడిలోని ఉత్సాహం, ఆటపట్ల ఉన్న అంకిత భావంలో ఎలాంటి మార్పు ఉండదనుకుంటున్నాను.

బ్యాటింగ్పై ఫోకస్ పెట్టాలి..
ఎందుకంటే, ఏ ఆటగాడికైనా దేశం కోసం ఆడటం కన్నా మించిన గొప్ప గౌరవం మరొకటి ఉండదు. కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు జట్టు కోసం శ్రమించాడు. విజయం కోసం కలలు కన్నాడు. ప్రస్తుతం అతను బ్యాటింగ్పై దృష్టి పెట్టి.. జట్టు కోసం పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. కెప్టెన్గా ఉన్నప్పుడు కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగేవాడు. ప్రస్తుతం కూడా అదే స్థానంలో ఆడుతాడు. జట్టులోకి ఎంతమంది ఆటగాళ్లు వచ్చినా అతని స్థానంలో ఎలాంటి మార్పూ ఉండదు' అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.

కోహ్లీ ఇగోను పక్కన పెట్టి ఆడాలి
టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను వదిలేస్తూ కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని దిగ్గజ సారథి కపిల్ దేవ్ స్వాగతించాడు. కోహ్లీ తన ఇగోను పక్కనపెట్టి యువ క్రికెటర్లతో ఆడాలన్నాడు. 'టీ20 కెప్టెన్సీ వదులుకున్నప్పటి నుంచి కోహ్లీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మనమంతా అతనికి మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో అతను కొంచెం గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కెప్టెన్సీని కూడా సరిగ్గా ఆస్వాదించలేకపోతున్నాడు. మరికొంత కాలం స్వేచ్ఛగా క్రికెట్ ఆడేందుకే కోహ్లీ ఇలా చేశాడనిపిస్తోంది.

అజారుద్దీన్ కెప్టెన్సీలో నేను కూడా..
బాగా ఆలోచించే ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నాడనుకుంటున్నాను. దిగ్గజ ఆటగాడైన సునీల్ గవాస్కర్ కూడా ఎలాంటి అహం లేకుండా నా కెప్టెన్సీలో ఆడాడు. నేను కూడా అలాంటివేమీ పట్టించుకోకుండా కృష్ణమాచారి శ్రీకాంత్, అజారుద్దీన్ నాయకత్వంలో ఆడాను. విరాట్ కూడా అహాన్ని పక్కనపెట్టి యువ క్రికెటర్లతో ఆడాలి. అది భారత్ క్రికెట్కు ఎంతో అవసరం. కొత్త కెప్టెన్, యువ ఆటగాళ్లకు మార్గ నిర్దేశం చేయాలి. కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడి సేవలను మేము కోల్పోవాలనుకోవట్లేదు' అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.


Click it and Unblock the Notifications
