ఓపెనర్లు మినహా బ్యాటింగ్ ఆర్డర్కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. టీ20ల్లో ఎన్ని పరుగులు చేశామనేది ముఖ్యం కాదని, ఎంత ప్రభావం చూపించామనేదే కీలకమని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయం నేపథ్యంలో గంభీర్.. బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. ప్రపంచకప్కు మూడు నెలల సమయం మాత్రమే ఉందని ఆటగాళ్లంతా సిద్దంగా ఉండాలని సూచించాడు. కాలంతో పాటు టీ20 క్రికెట్ కూడా మారుతుందని, కోచ్లు కూడా అప్డేట్ కావాలని అభిప్రాయపడ్డాడు.
'శ్రీలంకలో నేను హెడ్ కోచ్గా బాధ్యతల చేపట్టిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు ఒకే ఐడియాలజీతో ఉన్నాను. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ఓపెనర్లను మినహాయిస్తే.. బ్యాటింగ్ ఆర్డర్కు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓపెనర్లు మినహా మిగతా బ్యాటింగ్ లైనప్లో మార్పులు ఉంటాయి. ఎందుకంటే టీ20 క్రికెట్లో పరుగులు ఎన్ని చేశామనేది ముఖ్యం కాదు. ఎంత ప్రభావం చూపించామనేదే కీలకం.

జనాలు కొన్నిసార్లు పరుగులు, ప్రభావాన్ని వేర్వేరుగా చూడలేరు. తప్పుగా లెక్కిస్తారు. టీ20ల్లో ఫలితం మనం చూపించే ప్రభావంపైనే ఆధారపడి ఉంటుంది. 120 బంతుల గేమ్లో ప్రతీ బంతిపై అత్యంత ప్రభావాన్ని చూపించాలి. అందుకే మేం తొలి రోజు నుంచే అందుకు తగిన బ్యాటింగ్ ఆర్డర్ను ఎంచుకున్నాం. ఈ ఆటను కూడా మేం అదే విధంగా ఆడాలనుకుంటున్నాం.
టీ20ల్లో మేం సగటు, స్ట్రైక్రేట్ల గురించి ఆలోచిస్తూ ఆడాలనుకోవడం లేదు. ఏ పరిస్థితిలో ఏ ఆటగాడు ఎంత ప్రభావం చూపగలడనే దాని గురించే మేం ఆలోచిస్తున్నాం. ఇది ఈ జట్టుకు చాలా ముఖ్యమైనది. నా అభిప్రాయం ప్రకారం కాలంతో పాటు టీ20 క్రికెట్ మారుతుంది. కోచ్లు మారకపోతే ఆటలో వెనుకబడిపోతాం. టీ20 క్రికెట్లో మేం కాలానికి ముందే ఉండాలనుకుంటున్నాం. మా కుర్రాళ్లు ఈ ఆలోచనకు బాగా అలవాటు పడ్డారు. వారు ఈ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు.
భారత జట్టులో అద్భుతమైన ఆల్రౌండర్లు ఉన్నారు. ఈ రకమైన స్పిన్ ఆల్రౌండర్ల లగ్జరీ ఏ జట్లకు ఉంది. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కొన్నిసార్లు పేస్ ఆల్రౌండర్ల లగ్జరీ మనకు దొరకదు. కానీ విదేశీ జట్లు మన దేశానికి వచ్చినప్పుడు అక్షర్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు కీలకంగా మారుతారు. వారు బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగలరు. కేవలం బ్యాటర్గా కూడా జట్టులో కొనసాగగలరు. ఇది జట్టుకు కలిసొచ్చే అంశం. అప్కమింగ్ టీ20 ప్రపంచకప్లో ఈ ఇద్దరూ చాలా కీలకమవుతారు. వారికి ఉన్న నైపుణ్యాలతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగలరు.
ఈ కారణంతోనే వాషింగ్టన్ సుందర్కు గత 7-8 నెలలుగా జట్టులో అవకాశం ఇవ్వడం జరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఐదో స్థానంలో అక్షర్ పటేల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్లోనూ రాణించగలడు. పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేస్తాడు. బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండటం ఎప్పుడూ మంచిదే. గతంలో చాలా సార్లు ఆరో బౌలింగ్ ఆప్షన్ గురించి ఎక్కువ చర్చ జరిగేది. కానీ ఇప్పుడు మాకు 7-8 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇలాంటి ప్లేయర్లు ఉండటం జట్టుకు మంచిది. వారి సంఖ్య పెరుగుతూ ఉంటే భారత క్రికెట్కు తిరుగుండదు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.