రోహిత్ అత్యుత్తమం
టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండాలనే విషయంలో ఎప్పటి నుంచో విరాట్ కోహ్లీ సారథ్యాన్ని విమర్శిస్తున్న గౌతమ్ గంభీర్.. ఈసారి తన వ్యాఖ్యలకు మరింత పదునుపెట్టాడు. తాజాగా స్టార్స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ కార్యక్రమంలో ఆకాశ్ చోప్రా, పార్థివ్ పటేల్తో గంభీర్ మాట్లాడాడు. విరాట్ కోహ్లీ మంచి కెప్టెనే అయినా.. రోహిత్ శర్మ అత్యుత్తమం అని పేర్కొన్నాడు. రోహిత్, కోహ్లీలకు మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని గౌతీ పేర్కొన్నాడు. గంభీర్ భారత్ తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. ఇక 154 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. కోల్కతా జట్టుకు రెండు ట్రోఫీలు అందించాడు.
కోహ్లీ బాగానే రాణిస్తున్నాడు
గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై ఆకాశ్ చోప్రా స్పందించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త అభిప్రాయాలు, విశ్లేషణలతో భారత జట్టును మార్చాల్సిన అవసరం లేదన్నాడు. కొందరు ఆటగాళ్లు ఐపీఎల్ టోర్నీలో ఎలాంటి ప్రదర్శన చేసినా.. దాని ఆధారంగా మార్పులు చేయాల్సిన పరిస్థితి లేదని ఆకాశ్ స్పష్టం చేశాడు. అలాగే టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టీ20 ఫార్మాట్లో మంచి ప్రదర్శనే చేశాడని, అందులో ఎలాంటి తప్పు లేదన్నాడు. కెప్టెన్గా కోహ్లీ బాగానే రాణిస్తున్నాడని ఆకాశ్ చెప్పకనే చెప్పాడు.
కెప్టెన్సీ విషయంలో ఆ నియమం పాటించరా?
అనంతరం గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా పర్యటనకు టీ నటరాజన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ లాంటి ఆటగాళ్ల ఎంపిక సరైంది కాదన్నాడు. ఐపీఎల్ టోర్నీలో వారి ప్రదర్శన ఆధారంగానే ఎంపిక చేసినప్పుడు.. కెప్టెన్సీ విషయంలోనూ ఆ నియమం ఎందుకు పాటించరని ప్రశ్నించాడు. లేదా ఐపీఎల్ ప్రదర్శనను టీమిండియా ఎంపికకు ప్రామాణికంగా తీసుకోవద్దని సూచించాడు. ఇక పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. టీ20 ఫార్మాట్లో కోహ్లీ కన్నా రోహితే మ్యాచ్ పరిస్థితుల్ని సరిగా అర్థం చేసుకుంటాడని, ఒత్తిడిలోనూ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని పేర్కొన్నాడు.
భిన్న సారథ్యం నప్పదు
భిన్న సారథ్యం భారత సంస్కృతికి నప్పదని తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. ఒక బహుళ జాతి కంపెనీకి ఇద్దరు సీఈఓలు ఉండరు అని ఉదహరించారు. 'మన భారత క్రికెట్ సంస్కృతిలో కెప్టెన్సీ విభజన సాధ్యం కాదు. ఒక పెద్ద కంపెనీకి ఇద్దరు సీఈవోలు ఉండగలరా?.. ఓసారి ఆలోచించండి. విరాట్ కోహ్లీ టీ20ల్లో ఆడుతుంటే.. కెప్టెన్గానూ అతడినే కొనసాగించాలి. అతడు బాగానే ఆడుతున్నాడు. జట్టులో మరో కెప్టెన్ కూడా ఉండాలనే నిర్ణయాన్ని నేనూ స్వాగతిస్తా. కానీ అది చాలా కష్టం' అని కపిల్ దేవ్ అన్నారు.