
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా మరోసారి తన పెద్దమనసు చాటుకున్నాడు. ఈ నెల 27న తన పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు రైనా సిద్ధమయ్యాడు. తన కూతురు పేరుతో ఉన్న ఎన్జీవో 'గ్రేసియా రైనా' ఫౌండేషన్ తరపున ఉత్తరప్రదేశ్, జమ్ము, ఎన్సీఆర్లో ఉన్న 34 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను (పారిశుద్ధ్య, తాగునీటి వసతి సౌకర్యాలు, శానిటైజేషన్) కల్పించే బాధ్యత రైనా తీసుకున్నాడు. దీంతో ఆరోగ్య, పరిశుభ్రత పరంగా 10వేలకు పైగా విద్యార్థులకు అండగా నిలవనున్నాడు.
తన పుట్టినరోజు వేడుకలు ఆరంభించిన సందర్భంగా సురేష్ రైనా, తన భార్య ప్రియాంకతో కలిసి గజియాబాద్లోని ఓ పాఠశాలలో అభివృద్ధి చేసిన తాగునీటి సౌకర్యాన్ని, బాలబాలికల కోసం వేర్వేరు మరుగుదొడ్లను, చేతులు, గిన్నెలు కడుక్కునే ప్రదేశాలతో పాటు స్మార్ట్ తరగతి గదులను ప్రారంభించాడు. అలాగే పేద కుటుంబాలకు చెందిన 500 మంది మాతృమూర్తులకు రైనా దంపతులు నిత్యవసరాలు అందించారు.
తన పుట్టిన రోజు (ఈనెల 27)ను ఇలా జరుపుకోనుండడం సంతోషంగా ఉందని మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా చెప్పాడు. 'నాకు చాలా ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వడం ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటుంది. నేను 34 ఏళ్ల వయసులో నా ఎంతో ప్రత్యేకమైన, ఇష్టమైన ప్రాజెక్టును ప్రారంభించినందుకు సంతోషిస్తున్నా. గ్రేసియా ఫౌండేషన్ ద్వారా 34 పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు మరియు ఆరోగ్య సేవా కార్యక్రమాలను అందించడం బాగుంది' అని రైనా ట్వీట్ చేశాడు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన అంతర్జాతీయ క్రికెట్కు రైనా వీడ్కోలు తెలిపిన విషయం తెలిసిందే.
దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగిన సురేష్ రైనా.. 18 టెస్ట్లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్లో 193 మ్యాచ్లాడిన సురేశ్ రైనా 137.11 స్ట్రైక్రేట్తో ఏకంగా 5,368 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020లో ఆడని రైనా.. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే వారితో కలిసి పంటపొలాలకు వెళ్లి విందు భోజనం చేశాడు. తాజాగా కుటుంబ సభ్యుల కోసం వంట కూడా చేశాడు.