ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమిపాలైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆసీస్ 2 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అత్యుత్సాహం, కెప్టెన్ శుభ్మన్ గిల్ దురదృష్టం టీమిండియా పతనాన్ని శాసించింది.
స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలని మాజీ క్రికెటర్లు చేసిన సూచనలు పట్టించుకోకుండా సేమ్ కాంబినేషన్తో బరిలోకి దిగిన గంభీర్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లతో భారత్ పతనాన్ని శాసిస్తే.. భారత స్పిన్ ఆల్రౌండర్లు మూడు వికెట్లు మాత్రమే పడగొట్టారు. కుల్దీప్ యాదవ్ ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. శుభ్మన్ గిల్ వరుసగా రెండో మ్యాచ్లోనూ టాస్ ఓడిపోయాడు. ఇది కూడా భారత ఓటమికి కారణమైంది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 73), శ్రేయస్ అయ్యర్(77 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అక్షర్ పటేల్(41 బంతుల్లో 5 ఫోర్లతో 44), హర్షిత్ రాణా(18 బంతుల్లో 3 ఫోర్లతో 24 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ(0) మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా(4/60) నాలుగు వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్లెట్(3/36) మూడు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం ఆస్ట్రేలియా 46.2 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసి గెలుపొందింది. మాథ్యూ షార్ట్(78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 74), కూపర్ కన్నోల్లీ(51 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే సిడ్నీ వేదికగా శనివారం జరగనుంది. కెప్టెన్గా శుభ్మన్ గిల్ వరుసగా రెండు పరాజయాలు ఎదుర్కోవడంతో పాటు తొలి సిరీస్ను కోల్పోయాడు.