రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ర్యాంక్ టర్నర్ పిచ్తో ప్రత్యర్థికి ఉచ్చు బిగించాలని భావించిన భారత్ ఆ ఉచ్చులోనే పడి మూల్యం చెల్లించుకుంది. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 30 పరుగుల తేడాతో చిత్తయ్యింది. దాంతో రెండు టెస్ట్ల సిరీస్లో భారత్ 0-1తో వెనుకంజలో నిలిచింది.
తొలి టెస్ట్ ఓటమి నేపథ్యంలో పిచ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ తరహా పిచ్లతో టెస్ట్ క్రికెట్ను చంపేస్తున్నారని మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. పిచ్ క్యూరేటర్పై కూడా విమర్శలు గుప్పించారు. అయితే టర్నింగ్ ట్రాక్ అడిగింది తామేనని, కానీ అందుకు తగ్గట్లుగా తమ బ్యాటర్లు రాణించలేకపోయారని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలు నెటిజన్లకు మరింత కోపాన్ని తెప్పించాయి. స్పిన్ బౌలింగ్ ఆడలేక న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయిన తర్వాత కూడా మళ్లీ అదే ట్రాక్ అడగడం ఏంటని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే గౌహతి వేదికగా శనివారం నుంచి ప్రారంభమయ్యే భారత్-సౌతాఫ్రికా రెండో టెస్ట్కు ఎలాంటి పిచ్ తయారు చేస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పిచ్ గురించి గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ కీలకం కాదని, ఆటగాళ్ల నైపుణ్యం ముఖ్యమని చెప్పుకొచ్చాడు. పిచ్ ఇరు జట్లకు ఒకేలా ఉంటుందని గుర్తు చేశాడు.
'గౌహతిలో తొలి రోజు కాస్త టర్న్ లభిస్తోంది. కాబట్టి టాస్ అంత ముఖ్యం కాదు. మేం మరీ స్పిన్ పిచ్ల కోసం చూడటం లేదు. టీమిండియా తొలి టెస్ట్లో గెలిచి ఉంటే.. అసలు పిచ్ల గురించి చర్చే జరిగేది కాదు. పిచ్ విషయం కాకుండా ఆటగాళ్ల నైపుణ్యం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే పిచ్ ఇరు జట్లకు ఒకేలా ఉంటుంది. కాబట్టి గౌహతిలో ఎలాంటి పిచ్ ఉన్నా అందుకు తగ్గట్లు రాణించగల సత్తా మా ఆటగాళ్లకు ఉంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
గౌహతి పిచ్ను ఎర్రమట్టితో సిద్దం చేశారని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. 'గౌహతి పిచ్ ఎర్రమట్టితో సిద్ధం చేశారు. దీంతో ఎక్కువ పేస్, బౌన్స్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. టీమిండియా ముందే కోరినట్లుగా కచ్చితంగా పిచ్లో టర్న్ ఉంటుంది. అలాగే బంతి స్పిన్ అవడంతో పాటు వేగం, బౌన్స్ కూడా ఉండనున్నాయి. అయితే బౌన్స్ మరీ ఎక్కువగా ఉండకుండా క్యురేటర్లు జాగ్రత్త తీసుకుంటున్నారు.'అని సదరు అధికారి తెలిపాడు.