న్యూఢిల్లీ: క్రికెటర్ అయినందుకు సిగ్గు పడుతున్నానని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు. తన జీవితంలో పశ్చాతాపానికి గురయ్యే విషయం ఏదైనా ఉందా? అంటే అది క్రికెటర్ కావడమేనని తెలిపాడు. తాను క్రికెటర్ కావాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమయ్యాయి.
తాజాగా ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో భాగంగా సదరు చానెల్ హోస్ట్ అడిగిన ప్రశ్నలకు గంభీర్ సమాధానాలిచ్చాడు. 'నా జీవితంలో పశ్చాత్తాపానికి గురయ్యే విషయం ఏదైనా ఉందా అంటే అది.. నేను క్రికెటర్ అవ్వడమే. నేను క్రికెటర్ కాకుండా ఉండాల్సింది.'అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఎంతో మంది సారథ్యంలో ఆడిన గంభీర్ తన బెస్ట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే అని తెలిపాడు. ధోనీ, కోహ్లీ పేర్లను ప్రస్తావించలేదు. తన ఫేవరేట్ బ్యాటర్ యువరాజ్ సింగ్ అని బదులిచ్చాడు.
ఇక గౌతమ్ గంభీర్ ఎప్పుడు ఏదో కామెంట్ చేసి వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఆసియాకప్ 2023 టోర్నీలో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న ఈ బీజేపీ ఎంపీ అభిమానులకు వేలు చూపించి తీవ్ర ట్రోలింగ్కు గురయ్యాడు. కోహ్లీ అభిమానులకే వేలు చూపించాడని సోషల్ మీడియాలో ప్రచారం జరగ్గా.. దేశానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతోనే అలా రియాక్ట్ అయ్యానని గంభీర్ వివరణ ఇచ్చాడు.
ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా దుమారం రేపింది. నిక్కచ్చిగా తన అభిప్రాయాలను పంచుకునే గంభీర్.. ఇషాన్ కిషన్ను తుది జట్టులోనే కొనసాగించాలని తెలిపాడు. కేఎల్ రాహుల్ కోసం ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ను పక్కనపెట్టడం సరికాదన్నాడు. రాహుల్ కోసం రోహిత్, కోహ్లీలను పక్కనపెడతారా? అని ప్రశ్నించాడు. ఆటగాళ్ల పేర్ల కంటే ఫామ్ ముఖ్యమని స్పష్టం చేశాడు.
ఇక 2007 టీ20 వరల్డ్ కప్ తో పాటుగా, 2011 వన్డే ప్రపంచ కప్లను భారత్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు ఫైనల్లో అసాధారణ ప్రదర్శన కనబర్చాడు.