
న్యూఢిల్లీ: ఐసీసీ టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును సెలెక్షన్ కమిటీ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా మహేంద్ర సింగ్ ధోనీని బీసీసీఐ ఈ జట్టుకు మెంటార్గా నియమించింది. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం విభిన్నంగా స్పందించాడు. హెడ్ కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్, బ్యాటింగ్ కోచ్లు ఉండగా మెంటార్గా ధోనీ చేసేదేం ఉండదన్నాడు. బహుషా ఒత్తిడిని అధిగమించడం ఎలానో బాగా తెలుసనే కారణంతోనే మహీని మెంటార్గా ఎంపిక చేసి ఉండవచ్చని వివాదాస్పద రీతిలో చెప్పుకొచ్చాడు.
అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్'ఫాలో ద బ్లూ' షోలో మాట్లాడిన గంభీర్.. మెంటార్గా ధోనీని ఎంపిక చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. 'ఇందులో ధోనీ పాత్ర ఎంతో తెలియాల్సి ఉంది. ఇప్పటికే జట్టుకు ప్రధాన కోచ్, అసిస్టెంట్ కోచ్, బౌలింగ్ కోచ్ ఉన్నారు. కాబట్టి కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలు కాకుండా.. కొత్తగా అతడికి ఏదైనా ప్రత్యేకత ఉండాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే టీ20ల్లో టీమిండియా విజయవంతంగా కొనసాగుతోంది. కానీ, కష్టాల్లో లేదు. ఒకవేళ పొట్టి ఫార్మాట్లో భారత్ జట్టుకు నిలకడ లేకపోతే బయట నుంచి ఎవర్ని అయినా తీసుకోవచ్చు.
బహుశా.. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని, సవాళ్లను ఎదుర్కొన్న అనుభవం కలిగిన ధోనీ.. మెంటార్గా వ్యవహరిస్తే జట్టుకు మంచి జరుగుతుందని టీమ్మేనేజ్మెంట్ భావించి ఉండొచ్చు. అయితే ధోనీ ఎంపిక నైపుణ్యం పరంగా జరిగింది కాదు. ఎందుకంటే భారత జట్టులోని క్రికెటర్లందరూ నైపుణ్యం కలిగినవారే. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ధోనీ సహాయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్ల్లో ఎలా వ్యవహరించాలో ధోనీకి తెలుసు కాబట్టి.. ఆటగాళ్లకు అది ప్రయోజనంగా మారొచ్చు.
ముఖ్యంగా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లున్నారు. రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తీ, సూర్యకుమార్ యాదవ్లకు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. వారితో ధోనీ తన అనుభవాన్ని కచ్చితంగా పంచుకుంటాడు. ఈ ఒక్క విషయంలో తప్పా ధోనీ వల్ల జట్టుకు ఒరిగేదేమి లేదు. స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రవిశాస్త్రి, విక్రమ్ రాథోడ్, ఇతర సహాయ సిబ్బింది ఉండనే ఉన్నారు. " అని గంభీర్ చెప్పుకొచ్చాడు.