న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత పెద్ద ఆటగాడినైనా అతను ఏ మాత్రం లెక్క చేయడు. ముక్కు సూటితో మాట్లాడుతుంటాడు. ఈ తరహా ప్రవర్తనతోనే అతను అనేక వివాదాల్లో భాగమయ్యాడు.
ఈ దూకుడైన స్వభావంతోనే 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ తీవ్ర ఒత్తిడిలో అసాధారణంగా బ్యాటింగ్ చేసి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఈ రెండు టోర్నీల ఫైనల్లో గంభీర్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 97 పరుగులు చేసిన గంభీర్.. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎవరికీ తలొగ్గని గంభీర్.. క్రికెట్ కెరీర్లో చేసిన ఓ పనితో ఇప్పటికీ సిగ్గుపడుతున్నానని తాజాగా వెల్లడించాడు. ఐపీఎల్ 2014 సీజన్లో వరుసగా మూడు సార్లు డకౌట్ అవ్వడంతో తర్వాతి మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగేందుకు భయపడ్డానని తెలిపాడు.
ఓపెనర్గా బ్యాటింగ్ చేసే ధైర్యం లేక మనీష్ పాండేను ఓపెనర్గా పంపించానని గుర్తు చేసుకున్నాడు. కానీ మనీష్ పాండే కూడా ఆ మ్యాచ్లో డకౌటయ్యాడని, ఫస్ట్ డౌన్లో వెళ్లిన తాను కూడా ఒక్క పరుగుకే వెనుదిరిగానని తెలిపాడు. ఆ క్షణం తాను చాలా పశ్చాతాపానికి గురయ్యానని, సిగ్గుతో తల దించుకున్నానని చెప్పాడు.
ఓపెనర్గా బ్యాటింగ్ చేసేందుకు భయపడే మనీశ్ పాండేను పంపించినా.. బ్యాటింగ్ ప్రమోషన్ అనే సాకుతో అప్పట్లో తప్పించుకున్నానని గంభీర్ స్పష్టం చేశాడు. ఆ మ్యాచ్లో తాను చాలా ఒత్తిడికి గురయ్యానని తెలిపాడు. ఆ మ్యాచ్ అనంతరం మనీశ్ పాండేతో ఈ విషయం గురించి మాట్లాడానని.. ఇంకెప్పుడు అలా చేయనని అతనికి హామీ ఇచ్చినట్లు గంభీర్ గుర్తు చేసుకున్నాడు.
ఆ మరుసటి మ్యాచ్లో గంభీర్ మళ్లీ ఓపెనర్గా బరిలోకి దిగి సత్తా చాటాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఆ ఐపీఎల్లో గంభీర్ కెప్టెన్సీలోని కేకేఆర్ విజేతగా నిలిచింది. గంభీర్ కెప్టెన్సీలోని కేకేఆర్ 2012, 2014 సీజన్లలో చాంపియన్ గా నిలిచింది.
ఐపీఎల్ అరంగేట్ర సీజన్ నుంచి 2017 వరకు కేకేఆర్ టీమ్కు ప్రాతినిథ్యం వహించిన గంభీర్.. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగి అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాడు. 154 ఐపీఎల్ మ్యాచ్ల్లో 4,217 పరుగులు చేసిన గంభీర్.. మొత్తం 36 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.