టీమిండియా మాజీ ఓపెనర్, కాబోయే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన క్రికెట్ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన క్రికెట్ కెరీర్లో ఇప్పటికీ పశ్చాత్తాపపడే విషయం ఏదైనా ఉందా అంటే అది 2011 వన్డే ప్రపంచకప్లో భారత విజయ లాంఛానాన్ని పూర్తి చేయకపోవడమేనని తెలిపాడు. ఆ మ్యాచ్లో 97 పరుగులతో రాణించిన తాను మ్యాచ్ ముగించే అవకాశాన్ని ధోనీకి వదిలేయడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పాడు.
ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా శ్రీలంకతో జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. దాంతో భారత బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొనగా.. కుర్రాడైన విరాట్ కోహ్లీ(35)తో కలిసి గంభీర్ ఇన్నింగ్స్ నెలబెట్టాడు.

టీమిండియాను ఆదుకున్న గంభీర్..
కోహ్లీతో మూడో వికెట్కు 83 పరుగులు జోడించిన గంభీర.. ధోనీతో నాలుగో వికెట్కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీ మూడు పరుగుల వ్యవధిలో ఒత్తిడిని అధిగమించలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు మహేంద్ సింగ్ ధోనీ(91 నాటౌట్), యువరాజ్ సింగ్(21 నాటౌట్) కలిసి తనదైన శైలిలో మ్యాచ్ను ముగించాడు.
ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్.. 'ధోనీ.. ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్.. ఇట్స్ మెగ్నిఫిషెంట్ స్ట్రైక్ ఇంటూ ది క్రౌడ్. ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఈయర్స్...'అని రవిశాస్త్రి చెప్పిన కామెంట్రీ ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు గుర్తుంది. 2011 వన్డే ప్రపంచకప్ గురించి చర్చ వచ్చిన ప్రతీసారి ధోనీ సిక్స్ గురించి మాట్లాకుంటారు.
క్రెడిట్ అంతా ధోనీకి..
ధోనీ విన్నింగ్ షాట్తో తీవ్ర ఒత్తిడిలో ఆడిన గంభీర్ ఇన్నింగ్స్కు రావాల్సిన గుర్తింపు రాలేదు. ఈ విషయంలో గంభీర్ ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటాడు. 11 మంది కష్టపడితేనే 2011 వన్డే ప్రపంచకప్ టైటిల్ దక్కిందని, ధోనీ ఒక్క సిక్స్తో రాలేదని చాలా సందర్బాల్లో అసహనం వ్యక్తం చేశాడు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్ను క్రికెట్ కెరీర్లో పశ్చాత్తాప పడే విషయం ఏదైనా ఉందా? అని అడగ్గా.. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా విజయలాంఛనాన్ని పూర్తి చేయకపోవడమేనని బదులిచ్చాడు.
కాలం వెనక్కి తిప్పే అవకాశం ఉంటే..
'ఆ మ్యాచ్ను నేను ముగించాల్సింది. మరొకరికి వదిలేయకుండా భారత విజయలాంఛనాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నాదే. కాలాన్ని వెనక్కి తిప్పే అవకాశం లభిస్తే నేను మొదట చేసే పని అదే. మళ్లీ ఆ మ్యాచ్లోకి వెళ్లి విజయానికి కావాల్సిన ఆఖరి పరుగును నేనే చేస్తాను. నేను ఎన్ని పరుగులు చేశానన్నది ముఖ్యం కాదు. విజయానికి కావాల్సిన పరుగులు చేశానా? లేదా? అన్నదే కీలకం.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
కెప్టెన్సీ గురించి బాధ లేదు..
టీమిండియాకు సుదీర్ఘ కాలం సారథ్యం వహించే అవకాశం రాలేదనే బాధ తనకు లేదని చెప్పాడు. 'నాకు 6 మ్యాచ్లకు కెప్టెన్సీ చేసే అవకాశం దక్కింది. నా శక్తి సామర్థ్యాలకు తగ్గట్లు నేను జట్టును నడిపించాను. నేను ఎప్పుడు అభిమానులను అలరించేందుకే ఆడేవాడిని. కెప్టెన్సీ చేసే అవకాశం రానందుకు నాకేం బాధలేదు. ఎందుకంటే నా దేశాన్ని గెలిపించడమే నా పని. నేను ఏ జట్టుకు ఆడినా.. ఆ టీమ్ గెలిచేందుకు ప్రయత్నిస్తాను.'అని గంభీర్ వ్యాఖ్యానించాడు.