టీమిండియా హెడ్ కోచ్గా సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఎదురైన సిరీస్ పరాజయాన్ని తాను మరిచిపోలేనని గౌతమ్ గంభీర్ తెలిపాడు. జీవితాంతం ఈ ఓటమి తనను వెంటాడుతుందని చెప్పాడు. ఈ పరాజయాన్ని మరిచిపోయే ప్రయత్నం కూడా చేయనని, తమ ఆటగాళ్లకు పదే పదే గుర్తు చేస్తానని కూడా చెప్పాడు. రాహుల్ ద్రవిడ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్గా బాథ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ 2025 టోర్నీల్లో టీమిండియాను విజేతగా నిలిపాడు. కానీ సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం గంభీర్ హెడ్ కోచ్గా ఘోర పరాజయాలను చవిచూసాడు.
అతని పర్యవేక్షణలో టీమిండియా సొంతగడ్డపై న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో క్లీన్ స్వీప్ అయ్యింది. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై క్లీన్ స్వీప్ కావడం ఇదే తొలిసారి. ఈ పరాజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ 2025 ఫైనల్కు కూడా అర్హత సాధించలేకపోయింది. తాజాగా ఈ పరాజయంపై స్పందించిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్తో రెండో టెస్ట్ సందర్భంగా రెండో రోజు ఆట లంచ్ బ్రేక్లో అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన గంభీర్.. డబ్ల్యూటీసీ ఛాంపియన్గా నిలవాలంటే విదేశాల్లో కూడా రాణించాలని చెప్పాడు.

'వరల్డ్ బెస్ట్ టెస్ట్ టీమ్గా ఎదగాలంటే సొంతగడ్డపైనే కాకుండా విదేశాల్లోనూ ఆధిపత్యం కనబర్చాలనేది నా ఆలోచన. ఈ యువ జట్టు ఆ ఆలోచనను అమలు చేసింది. అత్యంత కఠినమైన ఇంగ్లండ్ పర్యటనలో పెద్దగా అనుభవం లేని మా యువ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఫలితం ఎలా ఉన్నా.. ప్రతీ రోజు మా ఆటగాళ్లు పోరాడిన తీరు అద్భుతం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించాలంటే సొంతగడ్డపై ఆధిపత్యం చెలాయిస్తే సరిపోతుందనే సిద్దాంతాన్ని నేను నమ్మను. ఎందుకంటే సొంతగడ్డపై మాత్రమే రాణిస్తే.. వరల్ట్ టెస్ట్ ఛాంపియన్గా నిలిచేందుకు ఏ మాత్రం అర్హులు కారు.
కోచ్గా న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఓటమిని మర్చిపోకూడదు కూడా. ఈ ఓటమిని మా ఆటగాళ్లకు పదే పదే గుర్తు చేయాలి. ఓటమిని మరిచి ముందుకు వెళ్లడం ముఖ్యమే. కానీ కొన్నిసార్లు గతాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గతాన్ని మర్చిపోతే తేలికగా తీసుకోవడం మొదలుపెడుతారు. దేనిని కూడా తేలికాగా తీసుకోకూడదు. ఎందుకంటే న్యూజిలాండ్ను మేం సునాయసంగా ఓడిస్తామని అంతా అనుకున్నారు. కానీ ఫలితం మరోలా వచ్చింది. ఇదే వాస్తవం. ఆట అంటేనే ఇలా ఉంటుంది.
నన్ను అడిగితే న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయాన్ని డ్రెస్సింగ్ రూమ్లో పదే పదే మా ఆటగాళ్లకు గుర్తు చేస్తూ ఉండాలని చెబుతాను. అందేకే మేం ప్రత్యర్థిని ఇంచ్ కూడా తేలికగా తీసుకోం. ప్రతికూల పరిస్థితుల్లో శుభ్మన్ గిల్ ఎలా రియాక్ట్ అవుతాడో అని నాకు చూడాలని ఉంది. అతనికి నేను ఎప్పుడూ అండగా ఉంటాను. అతనిపై ఈగ కూడా వాలనివ్వను. విమర్శలను స్వీకరించేందుకు నేను సిద్దంగా ఉన్నాను. అతను సరైన డైరెక్షన్లో నడిచే వరకు అండగా ఉంటాను.'అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.