టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టేందుకు తాను సిద్దమని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. అవకాశం వస్తే టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పాడు. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్తో ముగియనుంది. ఇప్పటికే బీసీసీఐ టీమిండియా హెడ్ కోచ్ పదవి ఎంపిక ప్రక్రియను మొదలు పెట్టింది.
దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. అయితే దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత బీసీసీఐ టీమిండియా హెడ్ కోచ్ పదవి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కనీసం దరఖాస్తుల విషయాన్ని కూడా వెల్లడించలేదు. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారు చేశారని, అతి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మరోవైపు గౌతమ్ గంభీర్ సైతం టీమిండియా హెడ్ కోచ్ పదవిని స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపాడు. 'భారత జట్టుకు కోచ్గా పనిచేయడం నాకిష్టం. అంతకు మించిన గౌరవం లేదు. మన జాతీయ జట్టుకు హెడ్ కోచ్గా పనిచేయడం అంటే ఎంతో గౌరవమైన బాధ్యత.
140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం కన్నా మించిన పదవి ఏది లేదు.'అని ఓ కార్యాక్రమంలో గంభీర్ వెల్లడించాడు.
అయితే గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టకపోతే సౌరవ్ గంగూలీకి ఆ బాధ్యత ఇవ్వాలనే వాదన కూడా వినిపించింది. ఇదే విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దాదాను ప్రశ్నించగా.. టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానని బదులిచ్చాడు.

'టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టడం నాకిష్టం. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా పనిచేయాలనుకుంటే అతను సరైన వ్యక్తి.'అని దాదా తెలిపాడు. ఇక రిషభ్ పంత్ టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తాడని చెప్పాడు.
'రిషభ్ పంత్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతను అద్భుతమైన ప్లేయర్. టీ20 ప్రపంచకప్ ఇంకా మొదలవ్వలేదు. భారత్ వామప్ మ్యాచ్ మాత్రమే ఆడింది. జూన్ 5న భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. టీమిండియా పటిష్టంగా ఉంది. అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది.'అని సౌరవ్ గంగూలీ తెలిపాడు.