టీమిండియా హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఐసీస్ కశ్మీర్ నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని గౌతమ్ గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్కు హత్య బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రోజే ఈమెయిల్ ద్వారా ఉగ్రవాదులు తనను బెదిరించారని గౌతమ్ గంభీర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 'I Kill You'అనే పదాన్ని రెండు సార్లు మెయిల్ చేసినట్లు అందులో ప్రస్తావించారు. హత్య బెదిరింపులపై గంభీర్ కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.

'బీజేపీ మాజీ ఎంపీ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఐసీస్ కశ్మీర్ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ విషయంపై గంభీర్.. బుధవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన ఫ్యామిలీకి భద్రత కల్పించాలని కోరారు.'అని గంభీర్ ఆఫీస్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
గంభీర్కు చంపేస్తామని బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. 2021 నవంబర్లోనూ.. ఎంపీగా ఉన్నప్పుడు ఇలాంటి బెదింపు మెయిల్ ఒకటి వచ్చింది. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న గంభీర్.. ఇటీవలే కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే వెకేషన్కు వెళ్లొచ్చారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం తర్వాత గంభీర్ ఇంటికే పరిమితమయ్యారు. గతేడాది జూలైలో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
కశ్మీర్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పహల్గామ్లో పర్యాటకులపై గత మంగళవారం(ఏప్రిల్ 22) ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. మతం పేరిట ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 28 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై యావత్ దేశం భగ్గుమంది. గౌతమ్ గంభీర్ సైతం ఈ దాడిని ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆయనకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.