టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హెడ్ కోచ్గా తనకు పూర్తి స్వేచ్ఛ లేదని, సొంత జట్టుతోనే పోటీపడుతున్నానని తెలిపాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఏకపక్ష నిర్ణయాలతో జట్టును నాశనం చేస్తున్నాడని గంభీర్పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అతను చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీసాయి.
న్యూజిలాండ్తో ఐదు టీ20 సిరీస్లో భాగంగా బుధవారం న్యూజిలాండ్తో తొలి టీ20 ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కలిసాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అతను సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ప్రధానిమంత్రి తర్వాత భారత దేశంలో అత్యంత కష్టమైన ఉద్యోగం గంభీర్దేనని ఆయన కొనియాడారు.
'నాగ్పూర్లో నా పాత మిత్రుడు గౌతమ్ గంభీర్తో కలిసి మంచి, అర్థవంతమైన చర్చను ఆస్వాదించాను. ప్రధాని తర్వాత భారతదేశంలో అత్యంత కష్టతరమైన బాధ్యతను నిర్వహిస్తున్న వ్యక్తి ఆయనే. ప్రతీ రోజూ లక్షలాది మంది గంభీర్ నిర్ణయాలను విమర్శిస్తున్నా.. ఆయన మాత్రం ఎంతో ప్రశాంతంగా దృఢ సంకల్పంతో, నిశ్శబ్దంగా ముందుకుసాగుతున్నాడు. అతని సమర్థవంతమైన నాయకత్వానికి నా అభినందనలు'అని గంభీర్తో ఉన్న ఫొటోను శశిథరూర్ పంచుకున్నాడు.

ఈ పోస్ట్కు ధన్యవాదాలు తెలిపిన గంభీర్.. అంతా సెటిల్ కావడానికి కాస్త సమయం పడుతుందన్నాడు. 'కృతజ్ఞతలు. అంతా సెటిల్ కావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. అప్పుడు కోచ్గా పూర్తి అధికారం సొంతమవుతుంది. అప్పటి వరకు నేను నా సొంత జట్టు సభ్యులతో పోటీపడటం సరదాగా ఉంటుంది.'అని గంభీర్ బదులిచ్చాడు.
ఈ పోస్ట్లో గంభీర్ ఎవరి పేరు ప్రస్తావించకపోయినా.. కోచ్గా తనకు పూర్తి అధికారాలు లేవని పరోక్షంగా వెల్లడించాడు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో గంభీర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. మూడో వన్డే ఓటమి అనంతరం మైదానంలోనే అభిమానులు గంభీర్కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. కోహ్లీ వారించినా వినలేదు.
ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం రాయ్పూర్ వేదికగా రెండో టీ20 జరగనుంది.