
న్యూఢిల్లీ: చివరి క్షణంలో సౌతాఫ్రికా పర్యటన నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడం భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో హిట్ మ్యాన్ అద్భుతంగా రాణించాడని, ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడని తెలిపాడు. ఇక సౌతాఫ్రికా పర్యటనకు ముందు బీసీసీఐ ముంబైలో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్లో బ్యాటింగ్ సాధన చేస్తూ రోహిత్ తొడకండరాల గాయానికి గురైన విషయం తెలిసిందే. దీంతో అతను టెస్టు సిరీస్కు దూరమయ్యాడని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. అతని స్థానంలో ప్రియాంక్ పాంచాల్ను ఎంపిక చేసినట్లు అందులో పేర్కొంది.
ఇక రోహిత్ దూరమవ్వడంపై స్పందించిన గంభీర్.. యువ ఆటగాడు ప్రియాంక్ పాంచల్కు మంచి అవకాశమని తెలిపాడు. 'రోహిత్ శర్మ సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు దూరమవ్వడం భారత్కు ఎదురుదెబ్బే. ప్రస్తుతం అతను సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణించాడు. సౌతాఫ్రికాతో సిరీస్లోనూ అతను అలానే ఆడుతాడనుకున్నా. ఇక రోహిత్ గాయంతో జట్టులోకి వచ్చిన ప్రియాంక్ పాంచల్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేశం గర్వపడేలా ఆడాలి. 'అని గంభీర్ సూచించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా తెలియని ప్రియాంక్ పాంచాల్.. భారత దేశవాళీ క్రికెట్లో మాత్రం టాప్ క్లాస్ ఓపెనర్. డొమెస్టిక్ క్రికెట్లో గుజరాత్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ 31 ఏళ్ల ఓపెనర్.. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై పర్యటించిన భారత్-ఎ జట్టుకి సారథ్యం వహించాడు. ఈ అనాధికారిక టెస్ట్ సిరీస్లో 96, 24, 0, 31 పరుగులు చేశాడు. ఈ సిరీస్ డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించాడు.
అహ్మదాబాద్కు చెందిన ప్రియాంక్ పాంచల్కు దేశవాళీ క్రికెట్లో అసాధారణ రికార్డులు ఉన్నాయి. 2008లో డొమెస్టిక్ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన ప్రియాంక్ ఇప్పటివరకు 100 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 45.52 సగటుతో 7,011 పరుగులు చేశాడు. ప్రియాంక్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 24 సెంచరీలు, 25 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. 314 నాటౌట్ అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా... 2016-17 రంజీ సీజన్లో 1,310 పరుగులు చేసాడు. అతని సూపర్ బ్యాటింగ్తో ఆ ఏడాది గుజరాత్ చాంపియన్గా నిలిచింది. గుజరాత్కు ఇదే ఫస్ట్ రంజీ ట్రోఫీ కావడం విశేషం. డిసెంబర్ 26 నుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య జోహన్నెస్బర్గ్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.