రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజయోత్సవ సంబరాల్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. విజయోత్సవాలతో జనాల ప్రాణాలు తీయడం సరికాదన్నాడు. క్రీడా విజయాలను ఉత్సవంగా జరపడానికి రోడ్ షోలు అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి గంభీర్ గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తొక్కిసలాట ఘటనపై మాట్లాడుతూ.. భవిష్యత్తులోనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు.
'విజయోత్సవ వేడుకల కంటే జనాల ప్రాణాలు ముఖ్యం. ఇక ముందైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి రోడ్ షోలు చేయవద్దు. క్రీడా విజయాలను ఉత్సవంగా జరపడానికి రోడ్ షోలు అవసరం లేదు.'అని గంభీర్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉంటాడని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అతన్ని అన్ని మ్యాచ్లు ఆడించలేమని చెప్పాడు. బుమ్రా గైర్హాజరీలోనూ రాణించే పేస్ విభాగం భారత్కు ఉందని తెలిపాడు.

'ఏ మూడు మ్యాచ్ల్లో బుమ్రాను ఆడించాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అతను ఎన్ని మ్యాచ్లు ఆడుతాడనేది కూడా ఇంకా ఖరారు కాలేదు. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడం ఎప్పుడైనా కష్టమే. కానీ మా బౌలింగ్ విభాగంలో బుమ్రాను భర్తీ చేసే క్వాలిటీ బౌలర్లు ఉన్నారు. బుమ్రా గైర్హాజరీతో మరొకరికి అవకాశం దక్కుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇదే జరిగింది. భారత జట్టులో ప్రతిభావంతులకు కొదవ లేదు.
మ్యాచ్ ఫలితాలను బట్టి బుమ్రాకు ఏ మ్యాచ్ల్లో విశ్రాంతి ఇవ్వాలనేది నిర్ణయిస్తాం. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత కూడా నేను ఒత్తిడిలో ఉన్నా. ఎందుకంటే కోచ్గా ఎప్పుడూ మంచి ఫలితాలు రావాలని నేను కోరుకుంటా. ప్రతీ మ్యాచ్లోనూ జట్టు నెగ్గాలని భావిస్తా. కరుణ్ నాయర్ కౌంటీ క్రికెట్ అనుభవం, అతని ఫామ్ టీమిండియాకు ఉపయోగపడుతుంది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.