
హైదరాబాద్: జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన మోడీ ప్రభుత్వంపై టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జమ్మూకశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు, 35ఏ రద్దు, రాష్ట్ర విభజన అంశాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో సోమవారం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత వెంటనే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. ఆర్టికల్ 370 రద్దును కొందరు స్వాగతిస్తుంటే.. మరి కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు భారత క్రికెటర్లు ఈ అంశంపై ట్విట్టర్లో స్పందించారు.
దీంతో అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. దీంతో రాష్ర్టాల సంఖ్య 29 నుంచి 28కి తగ్గింది. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 9కి చేరింది. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడక ముందు మొత్తం 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి.
మరోవైపు ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 7వ తేదీన ప్రకటన చేయనున్నారు. ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా పీడీపీ సభ్యులు రాజ్యసభలో చొక్కాలు చించుకుని నిరసన వ్యక్తం చేశారు.