వెస్టిండీస్తో రెండో టెస్ట్ కోసం న్యూఢిల్లీకి వచ్చిన భారత ఆటగాళ్లకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దావత్ ఇచ్చాడు. బుధవారం రాత్రి తన నివాసంలో జరిగిన ఈ డిన్నర్ కార్యక్రమానికి టీమిండియా ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్తో పాటు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా హాజరయ్యారు.
కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రాలతో పాటు ఇతర ఆటగాళ్లు టీమ్ బస్లో గంభీర్ నివాసానికి చేరుకున్నారు. తన ఆతిథ్యాన్ని స్వీకరించేందుకు వచ్చిన ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్కు గంభీర్ దంపతులు స్వయంగా వడ్డించినట్లు తెలుస్తోంది.
టీమిండియా ఆటగాళ్లకు హోమ్ టౌన్ ప్లేయర్స్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో మహేంద్ర సింగ్ ధోనీ కూడా రాంచీకి వచ్చిన భారత జట్టుకు తన ఫామ్ హౌస్లో దావత్ ఇచ్చాడు. మహమ్మద్ సిరాజ్, అంబటి రాయుడు, సిరాజ్లు కూడా సహచర ఆటగాళ్లకు విందు ఇచ్చారు.

వెస్టిండీస్తో తొలి టెస్ట్ను గెలిచిన టీమిండియా గురువారం నుంచి ఢిల్లీ వేదికగా రెండో టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు కనీసం ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని విండీస్ భావిస్తోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడం టీమిండియాకు కీలకం.
అహ్మదాబాద్ వేదికగా ఏకపక్షంగా సాగిన తొలి మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో వెస్టిండీస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలోనే ఢిల్లీ వేదికగా జరిగే రెండో టెస్ట్కు బ్యాటింగ్ పిచ్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల పాటు సాగేలా పిచ్ను తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.