టీమిండియా ఆటగాళ్లకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన ఇంట్లో దావత్ ఇచ్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో శుభారంభం చేసిన టీమిండియా.. రెండో మ్యాచ్లో గురువారం నమీబియాతో ఢిల్లీ వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీకి చేరిన టీమిండియాకు ఆదివారం రాత్రి గంభీర్ తన నివాసంలో ప్రత్యేక విందు ఇచ్చాడు. టీమిండియా ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ కూడా ఈ పార్టీకి హాజరయ్యారు. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్తో పాటు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
గతంలో వెస్టిండీస్తో టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా గంభీర్ ఇలాగే జట్టుకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆటగాళ్ల మధ్య ఒత్తిడిని తగ్గించి, ఒక కుటుంబ వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో గంభీర్ ఈ దావత్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. గంభీర్ పార్టీలో టీమిండియా ఆటగాళ్లు చిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ పార్టీలో భారత ఆటగాళ్ల కోసం గంభీర్ ప్రత్యేకమైన వంటకాలు ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మహేంద్ర సింగ్ ధోనీ కూడా రాంచీకి వచ్చినప్పుడు ఇలానే భారత జట్టుకు తన నివాసంలో దావత్ ఇచ్చేవాడు.

అమెరికాతో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ వన్ మ్యాన్ షోతో టీమిండియా గట్టెక్కిన సంగతి తెలిసిందే. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. 49 బంతుల్ 10 ఫోర్లు, 4 సిక్స్లతో 84 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు 161 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టును హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లతో కట్టడి చేశాడు. చివరికి అమెరికా 132 పరుగులకే ఆలౌటై 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలి మ్యాచ్లో అమెరికా బౌలర్ వాన్ షాల్క్ విక్ 4 వికెట్లతో భారత బ్యాటింగ్ పతనాన్ని శాసించాడు. విధ్వంసకర బ్యాటర్ల బలహీనతలను బయటపెట్టాడు.
నమీబియాతో జరిగే మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సూపర్-8 రేసులో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుంది. గంభీర్ నివాసంలో జరిగిన ఈ విందు కేవలం భోజనం కోసమే కాకుండా, అమెరికా మ్యాచ్లో జరిగిన బ్యాటింగ్ వైఫల్యాలను చర్చించడానికి, మానసికంగా జట్టును సిద్ధం చేయడానికి ఒక వేదికగా నిలిచింది.