భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలో టీమిండియా వేర్వేరు జట్లతో బరిలోకి దిగుతుందని నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హింట్ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియడంతో కొత్త హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే శ్రీలంక పర్యటనతో హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ తన బాధ్యతలను స్వీకరించనున్నాడు.
ఈ పర్యటనకు బయల్దేరే ముందు సోమవారం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడాడు. టీమిండియా భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించాడు. భవిష్యత్తులో టీ20, వన్డేలు, టెస్ట్ల్లో టీమిండియా వేర్వేరు జట్లతో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలిపాడు. అయితే ఇప్పుడే ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేనన్నాడు.

'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. వారు రిటైర్ అయిన నేపథ్యంలో టీ20ల్లో పెద్ద మార్పులు జరగనున్నాయి. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు జట్లు ఉంటాయాని ఇప్పుడే చెప్పలేను. కానీ భవిష్యత్తులో వేర్వేరు జట్లతో బరిలోకి దిగవచ్చు.
వన్డేలు, టెస్ట్ల్లో ఎంత నిలకడగా ఆడితే జట్టుకు అంత మంచిది. ఈ రెండు ఫార్మాట్లలో ఎక్కువ మంది ఆటగాళ్లు ఆడగలిగితే ఇంకా మంచిది. 'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేశాడు. మూడు ఫార్మాట్లు ఆడగలిగే అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నప్పుడు వేర్వేరు జట్లు ఎందుకన్నాడు. 'మూడు ఫార్మాట్లలో గొప్పగా ఆడే ఆటగాళ్లు ఉన్నప్పుడు వారినే ఆడించాలి. ఎవరిని ఆడించినా టీమ్ కాంబినేషన్ సమతూకంగా ఉండేలా చూడాలి. మూడు ఫార్మాట్లు ఆడేందుకు తగినంత మంది ఆటగాళ్లు ఉంటే అత్యుత్తమైన 15 మందిని ఎంపిక చేసేందుకు ప్రయత్నించాలి.'అని అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు.
శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు వెళ్లే భారత జట్లను సెలెక్షన్ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో రోహిత్ శర్మ భారత జట్టును నడిపించనున్నారు. ఈ నెల 27 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది.