న్యూఢిల్లీ: టీ20 ఫార్మాట్కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. 2024 టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని సూచించాడు. ఇతర దేశాలు ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టి యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్నాయని తెలిపాడు.
భారత సెలెక్టర్లు కూడా సీనియర్లకు స్పష్టమైన సమాచారమిచ్చి.. పృథ్వీ షా, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠిలకు వరుస అవకాశాలు ఇవ్వాలన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలోనూ టీమిండియా ఆసియాకప్, టీ20 ప్రపంచకప్లో విఫలమవడంపై స్పందించిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'సీనియర్ ఆటగాళ్లపై స్పష్టత ఉండాలి. సెలెక్టర్లకు మంచి కమ్యూనికేషన్ ఉండాలి. ఒకవేళ సెలెక్టర్లు వీళ్లను మించి ఇతరులను తీసుకోవాలని నిర్ణయించుకుంటే అలాగే చేయాలి. చాలా దేశాలు ఇలా చేశాయి. సీనియర్లు తొలగించినప్పుడు జరిగే రాద్దాంతం సర్వ సాధారణమే.
ఆటలో వ్యక్తుల గురించి ఆలోచించకూడదు. జట్టు లక్ష్యాలే ప్రధానం. వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారన్నదే ముఖ్యం. ఎందుకంటే మనం అక్కడికి వెళ్లి గెలవాలి. ఇలాంటి వాళ్లు ఇప్పటి వరకు దాన్ని సాధించకపోతే.. సూర్యకుమార్ లాంటి యువ ఆటగాళ్లు ఆ కల నెరవేర్చుతారేమో ఎవరికి తెలుసు.
సూర్యకుమార్ యాదవ్లాంటి ప్లేయర్లు ఉంటే వరల్డ్ కప్ గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా టీమ్లో ఉండాలి. పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్లకు వరుస అవకాశాలు ఇవ్వాలి. పృథ్వీ షాలాంటి ప్లేయర్ను ఎందుకు పక్కనబెట్టేశారో నాకైతే అర్థం కావడం లేదు.
దూకుడుగా ఆడే ప్లేయర్లే, టీ20 ఫార్మాట్కు అవసరం. వాళ్లే జట్టుకు విజయాలను అందించగలరు. టీ20 ఫార్మాట్కు తగ్గ ఆటగాళ్లను గుర్తించి, వాళ్లను ప్రోత్సాహించాల్సిన బాధ్యత మేనేజ్మెంట్పై ఉంది.'అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ చెప్పుకొచ్చాడు.