టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న ఫైనల్లో టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్కు అవకాశం ఇవ్వకపోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. శ్రీలంకతో గత మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన అర్ష్దీప్ సింగ్ను ఆడించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. హార్దిక్ పాండ్యా గాయంతో ఈ మ్యాచ్కు దూరం కాగా.. రింకూ సింగ్కు అవకాశం కల్పించారు. అయితే ఈ నిర్ణయాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు.
ఎక్స్ట్రా బ్యాటర్ కోసం బౌలింగ్ విభాగాన్ని బలహీనం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. బుమ్రాకు తోడుగా మరో ఎండ్లో ఎవరు బౌలింగ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా స్పిన్ బౌలింగ్పై ఆధారపడటం సరికాదని సూచిస్తున్నారు. మరోవైపు ఫైనల్లో అర్ష్దీప్ సింగ్ను కచ్చితంగా ఆడించాలని టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, రవిచంద్రన్ అశ్విన్ సూచించారు. స్లాగ్ ఓవర్లలో కచ్చితమైన యార్కర్లు వేయడం అర్ష్దీప్ సింగ్ స్పెషాలిటీ అని, హార్దిక్ లేకుంటే అతన్ని ఆడించాలని చెప్పారు. కానీ గంభీర్ మాత్రం ఎక్స్ట్రా బ్యాటర్కే ఓటేసాడు.

అర్ష్దీప్ సింగ్పై నెటిజన్లు సానుభూతి కనబరుస్తున్నారు. అద్భుత ప్రదర్శన కనబర్చిన తర్వాత కూడా జట్టులో చోటు దక్కించుకోకపోవడం దురదృష్టకరమని, గంభీర్ అనాలోచిత నిర్ణయాలతో అర్ష్దీప్ సింగ్కు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
తుది జట్లు:
పాకిస్థాన్ : సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారిస్(వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.