'కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టింది' అనే సామెత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు సరిగ్గా సరిపోతుంది. రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో టెస్ట్ల్లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరుసగా రెండు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నీల్లో టీమిండియా ఫైనల్కు చేరింది. మూడో టోర్నీలో కూడా ఫైనల్ దిశగా సాగింది.
కానీ అప్పుడే హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియడంతో గంభీర్ కొత్త కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అతని దురదృష్టమో లేక టీమిండియా దరిద్రమో తెలియదు కానీ.. గంభీర్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమిండియా ఘోర పరాజయాలను ఎదుర్కొంటుంది.
గతేడాది ఇదే సమయానికి సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. 93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారి సొంగడ్డపై క్లీన్ స్వీప్ అయ్యింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ పరాజయాలతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్ను చేజార్చుకుంది.

తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్ట్ల సిరీస్లోనూ టీమిండియా క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ అయితే భారత్లోనా? లేక సౌతాఫ్రికా గడ్డపై జరుగుతుందా? అనే సందేహం కలుగుతోంది. రోడ్డులాంటి పిచ్పై సౌతాఫ్రికా బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగా భారత బౌలర్లు విఫలమయ్యారు. విచిత్రం ఏంటో కానీ అదే వికెట్పై సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగితే భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు.
తొలి ఇన్నింగ్స్లో ఏదో వ్యూహాత్మక తప్పిదమని సరిపెట్టుకుంటే.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ను ఆలస్యంగా డిక్లేర్డ్ చేసి భారత్కు డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. కానీ భారత్ మాత్రం అదే తడబాటుతో ఘోర పరాజయం దిశగా సాగుతోంది. గంభీర్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే టీమిండియాకు ఈ పరిస్థితి దాపురించిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ముఖ్యంగా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్లు అయిన సర్ఫరాజ్ ఖాన్, అజింక్యా రహానే, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్తో పాటు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని విస్మరించడం టీమిండియాకు నష్టం చేసిందని కామెంట్ చేస్తున్నారు.
జట్టులో తాను ఆడించినట్లుగా ఆడే కెప్టెన్ను పెట్టుకొని ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటూ గంభీర్ జట్టును నాశనం చేస్తున్నాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ప్రతీ విషయంలో జోక్యం చేసుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయని మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా గంభీర్ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భారత క్రికెట్కు గంభీర్ మరో గ్రేగ్ ఛాపెల్లా తయారయ్యాడని విమర్శలు గుప్పిస్తున్నారు.