టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సుదీర్ఘంగా మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్ కోసం బీసీసీఐ.. కోల్కతా వేదికగా ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆదివారం ప్రారంభమైన ఈ ప్రాక్టీస్ శిభిరంలో టీ20 సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లంతా పాల్గొన్నారు.
రెండో రోజు అయిన సోమవారం నెట్స్కు దూరంగా హార్దిక్ పాండ్యాతో గంభీర్ ప్రత్యేకంగా మాట్లాడాడు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ ఇద్దరు చర్చించుకున్నారు. టీమిండియా వైస్ కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాకు ఇవ్వాలని గౌతమ్ గంభీర్ పట్టుబట్టాడని, అందుకు కెప్టెన్ రోహిత్ శర్మ, సెలెక్టర్లు అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే హార్దిక్- గంభీర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు సెలెక్షన్ కమిటీ గత శనివారం జట్టును ప్రకటించింది. టీమ్ వివరాలు వెల్లడించే ముందు సెలెక్షన్ కమిటీ సమావేశం నిర్వహించింది. అయితే జట్టు ఎంపికలో గంభీర్ అతి జోక్యాన్ని సెలెక్టర్లు సహించడం లేదని తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని, సంజూ శాంసన్ను కీపర్గా తీసుకోవాలని గంభీర్ ప్రతిపాదిస్తే.. అగార్కర్, రోహిత్ మాత్రం గిల్కు వైస్ కెప్టెన్సీ ఇచ్చి, కీపర్గా పంత్ వైపు మొగ్గు చూపారు. ఈ విషయంలో హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ శిభిరంలో గంభీర్-హార్దిక్ పాండ్యా దూరంగా నిలబడి సుదీర్ఘంగా మాట్లాడుకోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. జట్టులో ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదా? కోచ్ పెత్తనాన్ని సీనియర్ ఆటగాళ్లు సహించలేకపోతున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బుధవారం కోల్కతా వేదికగా తొలి టీ20 జరగనుంది. సోమవారం ప్రాక్టీస్ సెషన్లో మహమ్మద్ షమీ తీవ్రంగా సాధన చేశాడు. గాయంతో గతేడాదిగా జట్టుకు దూరంగా ఉన్న షమీ.. ఈ సిరీస్తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.