
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెబితేనే నోరు పారేసుకునే మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. తొలిసారి ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీలా మరే భారత కెప్టెన్ కూడా మూడు ఐసీసీ టైటిళ్లను గెలవలేరన్నాడు. టీ20 ప్రపంచకప్ 2022లో భారత నిష్క్రమణ అనంతర గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'రోహిత్ శర్మ కొట్టినట్టుగా మరో ప్లేయర్ వచ్చి డబుల్ సెంచరీలు కొట్టొచ్చు. విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ సెంచరీలు చేసే ప్లేయర్ కూడా రావచ్చు. కానీ మహేంద్ర సింగ్ ధోనీలా మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచే భారత కెప్టెన్ మాత్రం రాకపోవచ్చు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ధోనీకి, గౌతమ్ గంభీర్కీ అస్సలు పడదనే విషయం అందరికి తెలిసిందే. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్లో తనకు రావాల్సిన క్రెడిట్ను ధోనీ కొట్టేసాడని చాలా సందర్భాల్లో గంభీర్ ఆరోపించాడు. అంతేకాకుండా 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తాను సెంచరీ చేయకపోవడానికి ధోనీనే కారణమని కూడా తెలిపాడు. మాహీ గురించి ఎవ్వరైనా పొగిడినా, గంభీర్ స్పందించే విధానం వేరేగా ఉంటుంది. మాహీ ఓరియో బిస్కెట్స్కి 2011 వన్డే వరల్డ్ కప్ క్రెడిట్స్ కట్టబెడితే, తన ఇంట్లో పెంపుడు కుక్క పేరు 'ఓరియో'అంటూ వీడియో విడుదల చేశాడు.
అలాంటి గంభీర్ తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్ నుంచే ఇంటిదారి పట్టడంతో మాహీ కెప్టెన్సీని ప్రశంసించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఐపీఎల్లో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేసిన వారిలో గౌతమ్ గంభీర్ కూడా ఒకడు. రోహిత్ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదు టైటిల్స్ గెలిచినప్పుడు, ఒక్క టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీని కెప్టెన్గా కొనసాగించడాన్ని గంభీర్ తప్పుబట్టాడు.
కెప్టెన్గా రోహిత్ శర్మ, టీమిండియాకు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అందిస్తాడని బోలెడు నమ్మకం పెట్టుకున్నాడు.కానీ అతని అంచనాలను తలకిందులు చేస్తూ భారత జట్టు, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీస్ నుంచే నిష్కమించింది. దాంతో ఏం చెప్పాలో తెలియక ధోనీని ప్రశంసిస్తూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.