తమను తాము నిరూపించుకునేందుకు కుర్రాళ్లకు ఇదే సరైన సమయం అని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ నేపథ్యంలో టీమిండియా యువ ఆటగాళ్లను ఉద్దేశించి గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు లేరని, వారి గైర్హాజరీలో సత్తా చాటేందుకు ఇదే సరైన అవకాశంగా భావించాలని కుర్రాళ్లకు సూచించాడు.
ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఐపీఎల్ 2025 సీజన్ సందర్భంగా వీడ్కోలు పలికారు. దాంతో శుభ్మన్ గిల్ను టీమిండియా నయా టెస్ట్ సారథిగా నియమించగా.. రిషభ్ పంత్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జూన్ 20 నుంచి లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లండ్కు చేరుకున్న టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా కుర్రాళ్లను ఉద్దేశించి గంభీర్ చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

'ప్రస్తుతం మనం ఉన్న స్థితిని రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి మనం ముగ్గురు అత్యంత అనుభవం కలిగిన ఆటగాళ్లు రోహిత్, విరాట్, అశ్విన్ లేకుండా బరిలోకి దిగుతున్నాం. రెండోది దేశం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి మనకు ఉన్న అద్భుతమైన అవకాశంగా చూడటం. ఈ జట్టులో గెలవాలనే కోరిక, అభిరుచి, ప్రత్యేకంగా ఏదైనా చేయాలనే నిబద్దత ఉందని నేను అనుకుంటున్నాను. మనం త్యాగాలు చేస్తే.. మనం కంఫర్ట్ జోన్ల నుంచి బయటకు వస్తే.. మనం పోరాడటం ప్రారంభిస్తే.. ప్రతీ సెషన్, ప్రతీ గంట, ప్రతీ బంతిని మనం చిరస్మరణీయంగా మలుచుకోగలం.
ఆ ప్రయత్నాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించండి. దేశం కోసం ఆడటం కంటే పెద్ద గౌరవం మరొకటి లేదు. అందుకోసం ప్రతీ ట్రైనింగ్ సెషన్ను ఉపయోగించుకుందాం. దానికి అనుగుణంగా శిక్షణ పొందుదాం. బౌలర్లు అయినా.. బ్యాటర్లు అయినా.. ఒత్తిడిలో ఎలా ఆడబోతున్నామో ఇక్కడే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రతీ బంతిని ఒక ఉద్దేశంతో ఆడుదాం.'అని గంభీర్ కుర్రాళ్లను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.