సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో తమ ఓటమికి బ్యాటర్ల వైఫల్యమే ప్రధాన కారణమని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. పిచ్ క్యూరేటర్ను నిందించాల్సిన అవసరం లేదని, తాము కోరుకున్నట్లుగానే ఈ వికెట్ ఉందని తెలిపాడు. కానీ తమ ఆటగాళ్లే పిచ్కు తగ్గట్లుగా ఆడలేకపోయారని చెప్పాడు. పిచ్ ఎలా ఉన్నా.. 124 పరుగులు లక్ష్యం ఛేదించాల్సిందని అభిప్రాయపడ్డాడు.
సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా కోల్కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్.. తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. ఈ తరహా పిచ్లు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తాయని తెలిపాడు.
'ఈ తరహా పిచ్ను మేమే అడిగాం. పిచ్ క్యూరేటర్ మాకు చాలా సహకరించారు. ఇది కష్టమైన వికెట్ అని నేను అనుకోవడం లేదు. ఇది బ్యాటర్ల మానసిక ధైర్యాన్ని పరీక్షించగల వికెట్. ఎందుకంటే ఈ వికెట్పై మంచి డిఫెన్స్తో ఆడిన వారే పరుగులు చేయగలిగారు. బ్యాటింగ్ నైపుణ్యం కంటే ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని, టెక్నిక్, మానసిక ధైర్యం, టెంపర్మెంట్ను ఈ వికెట్ పరీక్షించింది.

ఈ తరహా వికెట్లు బ్యాటర్లను మరింత బలంగా మారుస్తాయి. వికెట్పై ఇంత టర్న్ లభించినా కూడా ఎక్కవ వికెట్లు పేసర్లకే దక్కాయి. మా బ్యాటర్లు టర్న్ను ఎలా ఆడాలో తెలుసుకోవాలి. మేం దీన్నే పరీక్షించాలనుకున్నాం. అందుకే ఈ వికెట్ అడిగాం. పిచ్ క్యూరేటర్ చాలా సహకరించారు. వికెట్ ఎలా ఉన్నా.. 124 పరుగులు ఛేదించదగినదే. ఈ వికెట్పై సాలిడ్ డిఫెన్స్తో ఓపికగా ఆడితే పరుగులు చేయగలరు. ఇది ఉత్సాహంగా భారీ షాట్లు ఆడే వికెట్ కాదు. కానీ ఓపికగా ఆడితే పరుగులు చేయవచ్చు. మేం కోరుకున్న పిచ్ ఇదే. కానీ మా ఆటగాళ్లే అందుకు తగ్గట్లు ఆడలేకపోయారు.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 93 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 2 ఫోర్లతో 31) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(0), కేఎల్ రాహుల్(1), ధ్రువ్ జురెల్(13), రిషభ్ పంత్(2), రవీంద్ర జడేజా(18), కుల్దీప్ యాదవ్(1), మహమ్మద్ సిరాజ్(0) తీవ్రంగా నిరాశపర్చారు. చివర్లో అక్షర్ పటేల్(26) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. తీవ్ర మెడనొప్పితో శుభ్మన్ గిల్ ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. దాంతో అతను బ్యాటింగ్కు రాలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మర్(4/21)తో పాటు మార్కో జాన్సన్(2/15), కేశవ్ మహరాజ్(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఎయిడెన్ మార్క్రమ్ ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు 93/7 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టెంబా బవుమా(136 బంతుల్లో 4 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా కార్బిన్ బోష్(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 25) రాణించాడు. ఈ ఇద్దరూ 8వ వికెట్కు 44 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ భాగస్వామ్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.