
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మరింత ఎక్కువగా బాధపడాలని మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఆ బాధను అనుభవించినప్పుడే మనిషి మరింత రాటు దేలుతాడని, రాహుల్ కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడని చెప్పాడు. పేలవ ఫామ్తో టెస్ట్ టీమ్లో చోటు కోల్పోయిన రాహుల్కు రీఎంట్రీ ఇచ్చేందుకు ఐపీఎల్ ఒక్కటే మార్గమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. జట్టులో చోటు కోల్పోయినప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుందని.. కొన్నిసార్లు అది మంచిదేనని చెప్పాడు.
ఇక ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్ను ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ఆడించని విషయం తెలిసిందే. అతని స్థానంలో శుభ్మన్ గిల్కు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో గంభీర్ మాట్లాడుతూ.. 'ప్రతీ క్రీడాకారుడు తన కెరీర్లో ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటాడు. అరంగేట్రం నుంచి రిటైర్మెంట్ వరకు నిలకడగా రాణించిన ఒక్క ఆటగాడు కూడా లేడు. ఎంతటి గొప్ప ప్లేయర్ అయినా ఇలాంటి విషమ దశను ఎదుర్కొన్నాడు. జట్టులో చోటు కోల్పోవడం బాధిస్తుంది. కొన్నిసార్లు అది మంచే చేస్తుంది.
మన స్థానంలో మరొకరు ఆడుతున్నప్పుడు.. డ్రింక్స్ తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు బాధగానే ఉంటుంది. కానీ ఆ బాధ మనల్ని మరింత కసిగా ఆడేలా చేస్తోంది. ఐపీఎల్లో ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్ అని, నాలుగైదు సెంచరీలు చేశాడని రాహుల్కు తెలుసు. కానీ ప్రస్తుతం భారత టీ20, టెస్టు తుది జట్లలో అతను లేడు. అప్కమింగ్ ఐపీఎల్ను ఒక టోర్నీలాగా చూడాలా? లేదా తనని తను ఆవిష్కరించుకునేందుకు వేదికగా మలుచుకోవాలా అన్నది రాహుల్ చేతిలో ఉంది. జట్టు, దేశం ఆశించే విధంగా బ్యాటింగ్ చేయగలనా? అని తనని తాను ప్రశ్నించుకోవాలి. 600 లేదా కేవలం 400 పరుగులు చేయడమన్నది ముఖ్యం కాదు. జట్టు విజయంలో భాగమవ్వడమే కీలకమనే విషయాన్ని గ్రహించాలి.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.