టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా వైజాగ్ వేదికగా జరుగుతున్న నాలుగో టీ20కి విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయంతో దూరం కాగా.. అతని స్థానంలో ఎక్స్ట్రా బౌలర్గా అర్ష్దీప్ సింగ్ను బరిలోకి దించారు. ఎక్స్ట్రా బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్ను ఆడించకుండా అర్ష్దీప్ సింగ్ను ఆడించడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
అయ్యర్ అంటే గంభీర్కు గిట్టదని, వ్యక్తిగత కక్ష్యతోనే అతన్ని పక్కనపెడుతున్నాడని ఆరోపిస్తున్నారు. తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ గత మూడు మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమయ్యాడు. తిలక్ వర్మ పూర్తిగా కోలుకోకపోవడంతో అతన్ని చివరి రెండు టీ20లకు కూడా సెలెక్టర్లు కొనసాగించారు. కానీ తిలక్ వర్మకు బ్యాకప్గా అయ్యర్ సిద్దం చేయాల్సి ఉండగా.. టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు.

ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చి ఆ జట్టును 11 ఏళ్ల తర్వాత ఫైనల్ చేర్చిన అయ్యర్కు టీ20 జట్టులో చోటివ్వలేదు. కెప్టెన్ శుభ్మన్ గిల్ కోసం ఆసియా కప్ 2025 టోర్నీకి ఎంపిక చేయలేదు. తిలక్ వర్మ గాయంతో జట్టులోకి వచ్చినా అతన్ని ఉద్దేశపూర్వకంగా తుది జట్టులోకి తీసుకోవడం లేదని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
నిలకడకు మారు పేరైన శ్రేయస్ అయ్యర్ను ఆడించాల్సిందని, మెగా టోర్నీలో అతను బాగా ఉపయోగపడుతాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అతను ఎంత విలువైన ఇన్నింగ్స్లో ఆడాడో ఒకసారి గంభీర్ గుర్తు చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. 'గంభీర్.. మీరేంటో మీ విధానలేంటో .. అస్సలు అర్థం కావు'అని మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం గంభీర్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. టీ20 ప్రపంచకప్ ముందు అయ్యర్కు అవకాశం ఇచ్చి జట్టును గందరగోళం చేయడం ఇష్టం లేకనే గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇషాన్ కిషన్ రూపంలో తిలక్ బ్యాకప్ ప్లేయర్ ఉన్నాడని మరొకరు అవసరం లేదనే యోచనలో టీమిండియా మేనేజ్మెంట్ ఉందని చెబుతున్నారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు. ఇషాన్ కిషన్కు చిన్న గాయం కావడంతో అతని స్థానంలో అర్ష్దీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడని చెప్పిన సూర్య.. అక్షర్ పటేల్ కోలుకోవడానికి ఇంకా కొంచెం సమయం పడుతుందన్నాడు.