టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లోనూ టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వకపోవడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్కు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. వరుసగా మూడు టెస్ట్ల్లో విఫలమైన కరుణ్ నాయర్పై వేటు వేసిన టీమిండియా.. సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకుంది. గాయాలతో జట్టుకు దూరమైన ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి స్థానాలను అన్షూల్ కంబోజ్, శార్డూల్ ఠాకూర్లతో భర్తీ చేసింది. స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ను కొనసాగించింది. బ్యాటింగ్ డెప్త్ కోసమే సుందర్ను తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వకపోవడంపై అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ను ఆడించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్ లోయరార్డర్ బ్యాటర్లను ఔట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమవుతున్నారని, కుల్దీప్ యాదవ్ ఆ పనిని పూర్తి చేస్తాడని కామెంట్ చేస్తున్నారు. మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీసినప్పుడు.. స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ మరింత ప్రభావం చూపుతాడని అభిప్రాయపడుతున్నారు.
కౌంటీ క్రికెట్లో చాహల్ కూడా రాణిస్తున్నాడని, కుల్దీప్ యాదవ్ను ఆడిస్తే భారత బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారేదంటున్నారు. కొందరైతే.. గౌతం గంభీర్కు బుద్దిలేదని ఘాటుగా విమర్శిస్తున్నారు. కుల్దీప్ యాదవ్.. మరే జట్టు తరఫున ఆడినా ఇప్పటికే 100 టెస్ట్లు ఆడేవాడని కామెంట్ చేస్తున్నారు. గౌతం గంభీర్ అనాలోచిత నిర్ణయాల కారణంగా కుల్దీప్ యాదవ్కు అన్యాయం జరుగుతుందని విమర్శలు గుప్పిస్తున్నారు.
నాలుగో టెస్ట్లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో శుభ్మన్ గిల్ టాస్ గెలవకపోవడం గమనార్హం. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఓవర్కాస్ట్ కండీషన్స్ నేపథ్యంలో బౌలింగ్ ఎంచుకుంది.
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.