టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్కు మరోసారి నిరాశే ఎదురైంది. సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా కటక్ వేదికగా మంగళవారం జరిగిన తొలి టీ20లో అతనికి భారత తుది జట్టులో చోటు దక్కలేదు. వికెట్ కీపర్గా జితేష్ శర్మను తీసుకోవడంతో సంజూ శాంసన్ బెంచ్కే పరిమితమయ్యాడు.
టీ20 ఫార్మాట్లో ఓపెనర్గా సత్తా చాటిన సంజూ శాంసన్ను వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కోసం బలి చేశారనే అభిప్రాయం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతుంది. శుభ్మన్ గిల్ కోసం ఓపెనింగ్ స్లాట్ త్యాగం చేసిన సంజూ శాంసన్కు మిడిలార్డర్లో అవకాశం కల్పించారు. ఆసియా కప్ 2025 టోర్నీలో సంజూ పర్వాలేదనిపించాడు. కానీ ఆ తర్వాత అతని బ్యాటింగ్లో నిలకడ లోపించడంతో పక్కకు పెట్టి ఫినిషర్ పాత్ర పోషించగల జితేష్ శర్మను జట్టులోకి తీసుకొచ్చింది. సంజూ కంటే ఫినిషర్గా ఆడే సామర్థ్యం జితేష్ శర్మకు ఉండటంతో అతనికే అవకాశం కల్పించింది.

అయితే సంజూ శాంసన్ స్థానంలో ఓపెనర్గా బరిలోకి దిగిన శుభ్మన్ గిల్.. ఒక్క మ్యాచ్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. తాజాగా సౌతాఫ్రికాతో తొలి టీ20లోనూ 4 పరుగులే చేసి క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. మరోవైపు ఓపెనర్గా సంజూ 17 ఇన్నింగ్స్ల్లో 995 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలతో పాటు మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన టీ20 కెరీర్లో సంజూ మూడు సెంచరీలు చేయగా.. ఈ మూడింటిని ఓపెనర్గానే సాధించాడు. అభిషేక్ శర్మతో కలిసి విధ్వంసకర భాగస్వామ్యాలు అందించాడు. కానీ శుభ్మన్ గిల్ కోసం గౌతమ్ గంభీర్ ఈ జోడీని విడదీసాడు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గంభీర్పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గంభీర్, అగార్కర్ రాజకీయాలకు శాంసన్ బలయ్యాడని కామెంట్ చేస్తున్నారు. శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ వరుసగా విఫలమైనా.. జట్టులో కొనసాగుతున్నారని, కానీ సంజూ శాంసన్ను మాత్రం ఒక్క మ్యాచ్కే పక్కనపెట్టేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజూ శాంసన్ను తిరిగి ఓపెనర్గా ఆడించాలని సూచిస్తున్నారు. పవర్ ప్లేలో సంజూ దూకుడుగా ఆడుతాడని చెబుతున్నారు.