
కాన్పూర్: గతంలో భారత పర్యటనకు వచ్చిన టీమ్స్ చేసిన తప్పిదాలను తాము పునరావృతం చేయమని, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తామని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా గురువారం నుంచి కాన్పూర్ వేదికగా ఫస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన కివీస్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పిచ్ పరిస్థితులను బట్టి అవసరమైతే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. టెస్టు మ్యాచులు జరుగనున్న కాన్పుర్, వాంఖడే మైదానాలు ప్రత్యేకమైనవని చెప్పుకొచ్చిన గ్యారీ స్టెడ్.. పిచ్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చాలన్నాడు. 'గతంలో భారత పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు ఎందుకు విఫలమయ్యాయో మేం పరిశీలించాం. అవే తప్పులను మేం పునరావృతం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్తో బరిలోకి దిగితే ఇక్కడి పిచ్లపై ప్రభావం చూపలేం. ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొలి మ్యాచ్లో విజయం సాధిస్తే.. మిగతా మ్యాచుల్లో అదే సూత్రాన్ని అనుసరిస్తామని చెప్పడం సరికాదు. పిచ్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడూ వ్యూహాలను మారుస్తూనే ఉండాలి. టెస్టు క్రికెట్లోని కొన్ని మూల సూత్రాలను పాటిస్తూనే.. మా ఆట తీరులో మార్పులు చేసుకుంటాం.'అని చెప్పుకొచ్చాడు.
ఈ రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు రోహిత్ శర్మ, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలు విశ్రాంతి తీసుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్కు అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలోనే వైస్ కెప్టెన్ అజింక్యా రహానే జట్టును నడిపించనుండగా.. అతనికి డిప్యూటిగా పుజారా కొనసాగనున్నాడు. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీ నేపథ్యంలో పలువురు యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఇక ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఎడమ చేతి కండరాల సంబంధిత గాయంతో దూరమయ్యాడు. అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్కు అవకాశం కల్పించారు.