
సచిన్ రిటైర్మెంట్ ఆలోచనల్లో ఉన్నాడు
తాజాగా టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్స్టన్ మాట్లాడుతూ... '2008లో దక్షిణాఫ్రికా జట్టుకు కోచ్గా పనిచేసి టీమిండియాకు వచ్చా. కోచ్గా బాధ్యతలు చేపట్టే సమయానికి సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ఆలోచనల్లో ఉన్నాడు. అప్పడు అతనికి నచ్చని పొజీషన్లో బ్యాటింగ్ చేస్తుండేవాడు. దాంతో క్రికెట్ని అప్పుడు సచిన్ ఎంజాయ్ చేసేలా నాకు కనిపించలేదు. అయితే నేను కోచ్గా వచ్చిన తర్వాత మూడేళ్ల వ్యవధిలో సచిన్ 18 సెంచరీలు చేశాడు' అని తెలిపాడు.

పూర్తి స్వేచ్ఛనిచ్చా
'నేను కోచ్గా వచ్చిన తర్వత సచిన్ టెండూల్కర్ ఏ పొజీషన్లో ఆడాలనుకున్నాడో ఆ స్థానంలో ఆడే స్వేచ్ఛనిచ్చాను. కాబట్టే అతడు ఆటను ఆస్వాదిస్తూ మంచి ఫలితాలు రాబట్టాడు. పరుగుల వరద పారించాడు. అతడు తన కెరీర్ను మరో ఐదు సంవత్సరాలు పొడగించుకున్నాడు. అంతేకాదు 2011 వన్డే ప్రపంచకప్ని టీమిండియా గెలవగలిగింది. నేను గొప్పగా కోచింగ్ ఏమీ చేయలేదు. కానీ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చా. జట్టుకు కావాల్సిన అనుకూల వాతావరణం కల్పించా. ఏదేమైనా సచిన్తో గొప్ప కోచింగ్ ప్రయాణాన్ని ముగించాను' అని కిర్స్టన్ వెల్లడించాడు.

ఏరికోరి ఛాపెల్ని కోచ్గా తెచ్చుకోగా
2008లో భారత్ జట్టు కోచ్గా బాధ్యతలు చేపట్టిన గ్యారీ కిర్స్టన్.. జట్టుని నెం.1 స్థానంలో నిలిపాడు. అయితే గ్యారీ కోచ్గా బాధ్యతలు చేపట్టే నాటికి టీమిండియాలో చాలా గందరగోళ వాతావరణం ఉంది. గ్యారీ కంటే ముందు కోచ్గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రేగ్ ఛాపెల్ అసమర్థ నిర్ణయాలే దానికి కారణం. అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏరికోరి మరీ ఛాపెల్ని కోచ్గా తెచ్చుకోగా.. అతని స్థానానికే ఎసరు పెట్టాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ బ్యాటింగ్ స్థానాలు కూడా మార్చేశాడు. దాంతో క్రీజులోకి వెళ్లే వరకూ ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్కి వెళ్లాలో ఎవరికీ అర్ధం కాకూండా పోయింది. అనంతరం కోచ్గా గ్యారీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకంగా మెగా టోర్నీనే గెలుచుకుంది.

ఏడు నిమిషాల్లోనే ఎంపిక
కోచ్గా కేవలం ఏడు నిమిషాల్లోనే బీసీసీఐ ఎంపిక చేసిందని గ్యారీ చెప్పాడు. 'నాకు ఇండియన్ క్రికెట్ టీం కోచ్ ఎంపిక ప్యానెల్లో ఉన్న సునీల్ గావస్కర్ నుంచి ఈమెయిల్ వచ్చింది. నువ్వు మా జట్టుకు కోచ్గా చేస్తావా? అని గవాస్కర్ అడిగాడు. జోక్ చేయడం లేదు గదా అని నేనన్నా. ఆయన వెంటనే ఇంటర్వ్యూకు ఆహ్వానించాడు. ఇదే విషయం నా భార్యకు చెబితే నీకు అంత సీన్ లేదంది. ఇంటర్వ్యూ కోసం బీసీసీఐ కార్యాలయంలోకి వెళ్లేటప్పుడు అప్పటి భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే ఎదురయ్యాడు. నువ్విక్కడేం చేస్తున్నావ్ అని కుంబ్లే ప్రశ్నించగా.. మీకు శిక్షణ ఇచ్చేందకు ఇంటర్వ్యూకు వచ్చానని సమాధానమిచ్ఛా. కోచ్ ఎంపిక ప్యానెల్ ఏడు నిమిషాలు ఇంటర్వ్యూ చేసింది' అని తెలిపాడు.
అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ను ఎదుర్కొవడం చాలా కష్టం: మహిళా క్రికెటర్


Click it and Unblock the Notifications












