ఆటగాళ్ల అనైక్యత, ఫిట్నెస్ సమస్యలే టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ వైఫల్యానికి ప్రధాన కారణమని ఆ జట్టు హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ అన్నట్లు తెలుస్తోంది. జట్టులోని కీలక ఆటగాళ్ల మధ్య మాటలు లేవని, మరికొంత మంది ఆటగాళ్లు తీవ్రమైన ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారని
గ్యారీ కిర్స్టన్ చెప్పినట్లు పాకిస్థాన్కు చెందిన జియో న్యూస్ పేర్కొంది.
ఈ కథనం ప్రకారం టీ20 ప్రపంచకప్కు కావాల్సిన సామర్థ్యం జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు లేదని, షాట్ సెలెక్షన్లో వారికి కనీస క్లారిటీ లేదని గ్యారీ కిర్స్టన్ విమర్శించినట్లు తెలుస్తోంది. తన కోచింగ్ కెరీర్లోనే ఇలాంటి జట్టు చూడలేదని, జట్టులోని చాలా మంది ఆటగాళ్లు కనీసం మాట్లాడుకోవడం లేదని కిర్స్టన్ అసహనానికి గురైనట్లు సమాచారం.

మెరుగైన ప్రదర్శన చేసేవారికే జట్టులో చోటు ఉంటుందని, జట్టు విజయం కోసం కలిసికట్టుగా ఆడేవారికే ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కిర్స్టన్ పీసీబీ అధికారులతో అన్నట్లు తెలుస్తోంది. పేలవ ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లను, గ్రూప్ రాజకీయాలు చేసేవారిని జట్టు నుంచి తొలగించాలని సెలెక్టర్లకు సూచించినట్లు సమాచారం.
టీ20 ప్రపంచకప్ 2024లో పసికూన అమెరికా, భారత్ చేతిలో వరుసగా ఓటమిపాలైన పాకిస్థాన్.. కెనడా, ఐర్లాండ్పై విజయం సాధించినా సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్-ఏ నుంచి భారత్తో పాటు రెండో స్థానంలో నిలిచిన అమెరికా టోర్నీలో ముందడుగు వేసాయి. కెప్టెన్సీ మార్పు విషయంలో షాహిన్ షా అఫ్రిది, బాబర్ ఆజామ్ మధ్య మాటల్లేవని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
అలాగే మహమ్మద్ అమీర్, బాబర్ ఆజామ్ మధ్య కూడా సఖ్యత లేదని తెలుస్తోంది. షాహిన్ షా అఫ్రిది, మహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ వంటి ఆటగాళ్లు తీవ్రమైన ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పీసీబీ పెద్దలు తమకు అనుకూలంగా ఉండే ఆటగాళ్లతో ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసినట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి.
2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు గ్యారీ కిర్స్టన్ కోచ్గా వ్యవహరించాడు. టీ20 ప్రపంచకప్ 2024కు ముందే అతను పాకిస్థాన్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. భారత్ చేతిలో పాక్ ఓడిన అనంతరం కిర్స్టన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 'ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసింది. 120 పరుగుల లక్ష్యం అంత సులువు కాదని నాకు తెలుసు.
భారత్ వంటి బలమైన జట్టే 120 పరుగులు చేసినప్పుడు అంత సులువైన పని కాదని అర్థమైంది. కానీ 72/2తో పటిష్టంగా ఉండి, ఇంకా 6-7 ఓవర్ల మిగిలి ఉన్నప్పుడు విజయం సులువు అనిపించింది. కానీ మా ఆటగాళ్లు లక్ష్యాన్ని అందుకోలేకపోయారు. చెత్త షాట్లతో మూల్యం చెల్లించుకున్నారు. కీలక సమయాల్లో అడ్డదిడ్డంగా ఆడి తప్పిదాలు చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిందే.'అని కిర్స్టన్ భారత్తో మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.