2011 ప్రపంచకప్ విజయం కన్నా గొప్పది..
ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్యుడి వరకు నీరజ్ చోప్రాకు నీరజనాలు పలుకుతున్నారు. ఎవరి స్టేటస్ చూసినా.. ఏ సోషల్ మీడియా వేదికలను కదిలించిన బల్లెం వీరుడి ఫొటోలు.. స్టోరీలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు.
నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణం భారత క్రికెట్ జట్టు గెలిచిన 2011 వరల్డ్కప్ కన్నా గొప్పదని పేర్కొన్నాడు. ఆజతక్ చానెల్ డిబెట్లో నీరజ్ చోప్రాను కొనియాడుతూ భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ కామెంట్స్పై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్వీటర్ వేదికగా స్పందించాడు. అయ్యా.. హర్భజనూ నువ్వు చెప్పింది నిజమే.. కానీ మనం ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడ, ఎప్పుడూ చేయవద్దని ట్వీట్ చేశాడు.

హాకీ విజయాన్ని కొనియాడితే..
అయితే గంభీర్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉంది. ఇటీవలే 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్లో కాంస్యంతో మెరిసిన విషయం తెలిసిందే. ఈ విజయం పట్ల కూడా యావత్ భారతం హర్షించింది. హాకీ టీమ్ను కొనియాడింది.
గంభీర్ కూడా హాకీటీమ్ను కొనియాడుతూ.. 2011 వన్డే ప్రపంచకప్ విజయం కన్నా హాకీ టీమ్ సాధించిన కాంస్యమే ఎక్కువని పేర్కొన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగింది. నెటిజన్లు గంభీర్పై ట్రోలింగ్ చేస్తూ ఓ ఆట ఆడుకున్నారు. ఆ క్రమంలోనే భజ్జీ కూడా అదే తరహా కామెంట్స్ చేయడంతో గంభీర్ ముందు జాగ్రత్తగా మనం అలా చెప్పకూడదని పేర్కొన్నాడు.

97 రన్స్తో కీలక పాత్ర..
ప్రస్తుతం గంభీర్ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. క్రికెట్ను మతంలా భావించే ఈ దేశంలో ఇతర క్రీడలకు దక్కే ఆదరణ అంతంత మాత్రమేననే విషయం గంభీర్ వ్యాఖ్యలతో మరోసారి తెలుసొచ్చింది. ఇక 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ..మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2011 ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ జట్టులో హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్ కూడా ఉన్నారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో గంభీర్(97) అద్భుత ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకోవడంతో అతనికి రావాల్సిన పేరు రాలేదు.

టోక్యో హీరోలకు బీసీసీఐ నజరానా..
టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకాలతో మెరిసిన భారత అథ్లెట్లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నగదు పురస్కారాలు ప్రకటించింది. బీసీసీఐ సెట్రటరీ జైషా ట్వీటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు.
స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రాకు కోటీ రూపాయలు, సిల్వర్ మెడల్ సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాను, రెజ్లర్ రవికుమార్ దహియాలకు రూ.50 లక్షలు, సిల్వర్ మెడలిస్ట్లు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బాక్సర్ లవ్లీనా బార్గోహేన్, రెజ్లర్ బజరంగ్ పూనియాలకు తలో రూ. 25 లక్షలు ఇవ్వనున్నట్లు జైషా తెలిపారు. ఇక 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో పతకం సాధించిన భారత హాకీ జట్టుకు రూ.1.25 కోట్లు ఇస్తామన్నారు.


Click it and Unblock the Notifications












