దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. ఈ పేలుడు సంఘటనపై టీమిండియా మాజీ హెడ్ కోచ్, ఢిల్లీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన గంభీర్.. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
'ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన కారణంగా ప్రాణనష్టం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.'అని గంభీర్ ట్వీట్ చేశారు. టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టకముందు గంభీర్.. 2019 నుంచి 2024 వరకు ఈస్ట్ ఢిల్లీ ఎంపీగా కొనసాగారు.

న్యూఢిల్లీ బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో కోల్కతాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సౌతాఫ్రికా ఆటగాళ్లు భారత్కు రాగా.. వారికి భద్రతను పెంచారు. టీమిండియా ఆటగాళ్ల భద్రతను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ వద్ద కూడా భద్రత కట్టుదిట్టం చేశారు.
వారు బస చేయనున్న హోటళ్ల వద్ద కూడా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మ ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ను సందర్శించి, భద్రతా ఏర్పట్లను సమీక్షించే అవకాశముంది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు, పోలీసులు భద్రత ఏర్పాట్ల విషయమై సమావేశం కానున్నారు.
ఢిల్లీలోని పేలుడు ఘటనలో ఉగ్ర కుట్ర ఉన్నట్లుగా అధికారులు సందేహిస్తున్నారు. పేలుడుకు కారణమైన కారును చివరిగా కశ్మీర్లోని పుల్వామాకు చెందిన వైద్యుడు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అతనికి ఫరీదాబాద్లోని మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయని జాతీయ మీడియా పేర్కొంది.
జమ్మూకశ్మీర్లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించిన సంగతి తెలిసిందే. అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సల్ఫార్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హరియాణాలోని ఫరీదాబాద్లో డాక్టర్ ముజమ్మిల్, డాకట్టర్ ఆదీల్ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే కారు యజమాని అయిన డాక్టర్ ఉమర్ మహ్మద్ భయాందోళనకు గురయ్యాడని, ఎర్రకోట సమీపంలో పేలుడు జరిపినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.