ఐసీసీ టోర్నీ ఏదైనా అందరూ ఆసక్తిగా ఎదురు చూసే భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ఈ హైఓల్టేజ్ మ్యాచ్కు తెరలేవనుంది. ఏండ్లు గడుస్తున్నా.. ఆటగాళ్లు మారుతున్నా.. దాయాదుల పోరుపై మాత్రం అభిమానుల్లో ఆసక్తి తగ్గడం లేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వేదికగా మరోసారి ఆ అనూభూతిని అందించేందుకు ఇరు జట్లు రెడీ అయ్యాయి.
బంగ్లాదేశ్పై భారీ విజయంతో ఛాంపియన్స్ ట్రోఫీ వేటను ప్రారంభించిన భారత్.. సెమీస్ బెర్త్పై గురిపెట్టింది. గ్రూప్-ఏ భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్లో పాకిస్థాన్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ విజయం సాధిస్తే భారత్ సెమీస్ బెర్త్ ఖరారు కానుంది. మరోవైపు న్యూజిలాండ్ చేతిలో ఓటమితో ఈ టోర్నీని ప్రారంభించిన పాకిస్థాన్కు భారత్తో మ్యాచ్ చావో రేవోలా మారింది.

ఓడితే ఇంటికే..
ఈ మ్యాచ్లో ఓడితే పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. 25 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాక్.. లీగ్ దశలోనే వెనుదిరిగితే.. టోర్నీ కల తప్పనుంది. ఈ క్రమంలోనే ఆ జట్టు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇప్పటి ఈ మ్యాచ్పై ప్రపంచవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయ్యింది. ఆదివారం సెలువు దినాన ఈ మ్యాచ్ జరుతుండటంతో భారత్-పాక్ మ్యాచ్ను క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు అధికారిక బ్రాడ్కాస్టర్.. జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ సిద్దమయ్యాయి.
భారీగా పెరిగిన యాడ్స్ టారిఫ్..
ఇప్పటికే యాడ్స్ టారిఫ్ ప్లాన్స్ అమాంతం పెంచేసాయి. ఐదు సెకన్ల యాడ్కు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాయి. మరోవైపు అభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసం సిద్దమవుతున్నారు. కొందరు ఈ మ్యాచ్లో భారత్ గెలవాలని పూజలు చేస్తుంటే.. మరికొందరు నచ్చిన ఆహారం వండుకొని.. స్నేహితుల మధ్య ఈ మ్యాచ్ను చూడబోతున్నామని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
పెళ్లాం పిల్లల్ని వదిలేస్తారు.. కానీ!
ప్రస్తుతం INDvsPAK యాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండింగ్గా మారింది. మరికొందరు భారత్-పాక్ మ్యాచ్పై ఫన్నీ పోస్ట్లు పెడుతు నవ్వులు పూయిస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా.. పెళ్లాన్ని అయినా వదిలేస్తారేమో కానీ.. టీవీలను మాత్రం వదలరని సెటైర్లు పేల్చుతున్నారు. సాధువులు క్రికెట్ ఆడిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. పెళ్లాం పిల్లల్ని అయినా వదిలేస్తారేమో కానీ.. క్రికెట్ను మాత్రం అస్సలు వదలరంటూ క్యాప్షన్గా పేర్కొంటున్నారు. భారత్లో క్రికెట్ మతం కంటే ఎక్కువని, క్రికెట్ ఓ మతమని అభిప్రాయపడుతున్నారు. అన్ని మతాల వారు కలిసి ఎంజాయ్ చేసిది క్రికెట్ను మాత్రమేనని, భారత్-పాక్ మ్యాచ్ను అస్సలు విస్మరించరని అభిప్రాయపడుతున్నారు.