ఆసియా కప్ 2025 టోర్నీలో ఒకే ఒక్క బంతి ఆడిన టీమిండియా ఫినిషర్ రింకూ సింగ్ .. బౌండరీతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. టోర్నీకి ముందే ఆఖరి బంతి ఆడి, విన్నింగ్ షాట్ కొట్టాలని ఉందని బ్రాడ్ కాస్టర్ యాంకర్కు చెప్పిన రింకూ సింగ్.. అందుకు తగ్గట్లే ఫైనల్లోనే ఆడి టీమిండియాకు విజయాన్నందించాడు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా రింకూ సింగ్.. తన సోదరికి ఖరీదైన బహుమతిని ఇచ్చాడు. లక్ష రూపాయల ఎలక్ట్రిక్ స్కూటర్ను గిఫ్ట్గా ఇచ్చి తన సోదరిని సర్ప్రైజ్ చేశాడు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. తన తల్లి, తండ్రి, సోదరితో కలిసి స్కూటీపై దిగిన ఈ ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అతని సోదరి కూడా రింకూ సింగ్కు థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోలను పోస్ట్ పెట్టింది. కొన్ని నెలల క్రితం రింకూ సింగ్ తన తండ్రికి స్పోర్ట్స్ బైక్ను బహుమతిగా ఇచ్చాడు. తాజాగా తన సోదరి కోరికను నెరవేర్చాడు.

ఆసియా కప్ 2025 టోర్నీలో బెంచ్కే పరిమితమైన రింకూ సింగ్.. వాటర్ బాయ్గా సేవలందించాడు. కానీ అతని అదృష్టమో ఏమో కానీ ఫైనల్ మ్యాచ్లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. క్రీజులోకి వచ్చి ఒకే ఒక్క బంతిని ఎదుర్కొని టీమిండియా విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఎన్ని బంతులాడమని కాదు, విన్నింగ్ షాట్ కొట్టమా లేదా? అని మ్యాచ్ అనంతరం రింకూ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు.
ఈ టోర్నీ అనంతరం తన స్వస్థలం అలీఘర్కు వచ్చిన రింకూ సింగ్.. తన సోదరి నేహాకు రూ. లక్ష విలువ గల vida vx2 ఎలెక్ట్రిక్ స్కూటర్ను బహుమతిగా ఇచ్చాడు. అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్టార్ క్రికెటర్గా ఎదిగిన రింకూ సింగ్.. తన మూలాలను మాత్రం మరిచిపోలేదు. ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బుతో అలీఘర్లో సుమారు రూ.3.5 కోట్లకు మూడంతస్థుల భారీ భవనాన్ని కొనుగోలు చేశాడు.
ఆ ఇంటికి తన తల్లి పేరు వచ్చేలా వీణ ప్యాలెస్ అని పెట్టాడు. సైకిల్, స్కూటర్పై గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసిన తన తండ్రికి స్పోర్ట్స్ బైక్ను బహుమతిగా ఇచ్చాడు. త్వరలోనే రింకూ సింగ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. యూపీ ఎంపీ అయిన ప్రియా సరోజ్తో రింకూ సింగ్కు నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. ప్రియా సరోజ్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రేమలోకి దింపినట్లు రింకూ సింగ్నే స్వయంగా వెల్లడించాడు.