హైదరాబాద్: ముంబైలోని వాంఖడె వేదికగా చెన్నైతో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో తమ ఓటమికి కారణం షేన్ వాట్సన్ అని సన్రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్ టామ్ మూడీ మాట్లాడుతూ 'వాట్సన్ ఇన్నింగ్స్ ప్రత్యేకం. మేం పోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించాం. కానీ తన ప్రత్యేకమైన ఆటతో మా విజయాన్నిలాగేసుకున్నాడు. ఈ సీజన్ అద్భుతంగా సాగింది. మేం ఇంట (హోం గ్రౌండ్), బయట అద్భుతంగా రాణించాం' అని తెలిపాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్
'కొన్ని మ్యాచ్లు ఓడినప్పటికి టోర్నీలో మాపై అంతగా ప్రభావం చూపలేదు. కేన్ విలియమ్సన్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. రషీద్ గొప్ప క్రికెటర్. భారత అభిమానులు మాత్రమే కాదు ప్రపంచం మొత్తం అతని మాయలో పడిపోయింది. బౌలింగ్లోనే కాదు, మైదానంలోని అతని కమిట్మెంట్ గొప్పది' అని టామ్ మూడీ చెప్పాడు.
టోర్నీలో భాగంగా ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది. హైదరాబాద్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఓపెనర్ షేన్ వాట్సన్ (57 బంతుల్లో 117 నాటౌట్, 11ఫోర్లు, 8సిక్స్లు) అద్భుత సెంచరీతో చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో విజయం సాధించడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఓ సరికొత్త రికార్డుని నమోదు చేసింది. ఐపీఎల్ 11వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్పై నాలుగుసార్లు గెలిచి ఓ అరుదైన ఘనత సాధించింది.
ఈ సీజన్లో లీగ్ దశలో సన్రైజర్స్ హైదరాబాద్పై రెండుసార్లు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత క్వాలిఫయర్-1, ఐపీఎల్ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్పై చెన్నై విజయం సాధించి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో ఒక సీజన్లో ఒక జట్టుపై అత్యధికంగా నాలుగుసార్లు గెలిచిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ చరిత్ర సృష్టించింది.